Fact Check: ఆ బుడ్డోడికి రూ. 23 లక్షల కారు గిఫ్ట్‌..!

12 Aug, 2021 20:27 IST|Sakshi

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న హసదేవ్‌ డిర్డో వీడియో

వాస్తవాలు వెల్లడించిన ఎంజీ కంపెనీ ప్రతినిధులు

Bachpan Ka Pyaar Boy: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్‌ డిర్డో అనే బాలుడు ఒక్కపాటతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. హసదేవ్‌ పాఠశాలలో ‘బచ్ పన్ కా ప్యార్ హై’ పాట పాడుతుండగా కొందరు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒక్కసారిగా వైరల్‌గా మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు చేరింది. ఆ బుడతడి గొంతుకు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భాగేల్‌ కూడా ఫిదా అయ్యారు. హసదేవ్‌ డిర్డోని పిలిపించుకుని బచ్‌పన్‌ కా ప్యార్‌ పాట పాడించుకుని.. ఆశీర్వదించారు. ఇక అనుష్క శర్మ కూడా హసదేవ్‌ గొంతుకు పడిపోయారు.

ఈ క్రమంలో హసదేవ్‌కు సంబంధించిన ఓ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యింది. అందేంటే హసదేవ్‌ పాటకు ఫిదా అయిన ఎంజీ కంపెనీ.. ఆ పిల్లాడికి 23 లక్షల రూపాయల విలువ చేసే ఎంజీ హెక్టార్‌ కారును బహుకరించిందనేది ఆ వార్తల సారాంశం. ఇక హసదేవ్‌ డిర్డో ఎంజీ కారు ముందు నిలబడి ఉన్న ఫోటో, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. వీటిలో హసదేవ్‌ చేతిలో కారు కీ పట్టుకుని ఉండటం.. పక్కనే కంపెనీ యజమాని, ఓ సేల్స్‌గర్ల్‌ ఉండటంతో అందరు ఇది నిజమని భావించారు. కానీ హసదేవ్‌కు కారు బహుకరించారనే వార్త అవాస్తవం. దీన్ని స్వయంగా ఎంజీ కంపెనీనే ప్రకటించింది. 

ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘హసదేవ్‌ డిర్డో ఎంజీ కంపెనీ నిర్వహించిన ఓ డీలర్‌షిప్‌ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యాడు. ఆ సమయంలో హసదేవ్‌ కారు ముందు ఫోటో దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటో, వీడియో వైరల్‌ కావడంతో అందరూ మా కంపెనీ హసదేవ్‌కు ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చిందని భావించారు. అయితే ఈ వార్త అవాస్తం. ఆ కార్యక్రమానికి హాజరయినందుకు మేం హసదేవ్‌ డిర్డోకి కేవలం 21 వేల రూపాయలు బహుమతిగా ఇచ్చాం’’ అని వెల్లడించారు. ఇదే విషయాన్ని హస్‌దేవ్‌ కుటుంబీకులు కూడా ధ్రువీకరించారు. 

మరిన్ని వార్తలు