పాక్‌ జర్నలిస్ట్‌ ఆరోపణలు.. స్పందించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి

13 Jul, 2022 20:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) కోసం గూఢచర్యం చేసినట్లు పేర్కొన్న పాకిస్తానీ జర్నలిస్టును యూపీఏ హయాంలో హమీద్‌ అన్సారీ తనను భారత్‌కు ఆహ్వానించారంటూ ఆరోపణలు వెలువెత్తాయి. ఐతే ఆ ఆరోపణలన్నింటిని హమీద్‌ అన్సారీ తోసి పుచ్చారు. ఈ మేరకు యూపీఏ హయాంలో తాను ఐదుసార్లు భారత్‌కు వచ్చానని, పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకి సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు పాకిస్తానీ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జా పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా హమీద్‌ అన్సారీని ప్రశ్నించడంతో ఆయన ఇలా వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ మాట్లాడుతూ..."నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి తరుపున విదేశీ అతిథులకు ఆహ్వానాలు ప్రభుత్వ సలహా మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా పంపబడుతుంది. నేనెవర్నీ రీసివ్‌ చేసుకోలేదు, ఆహ్వానించ లేదు. తాను రాయబారిగా ఉన్న సమయాల్లో ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాను.

ఇరాన్ రాయబారిగా నేను చేసిన పని గురించి అప్పటి ప్రభుత్వానికి తెలుసు. నేను జాతీయ భద్రతకు కట్టుబడి ఉన్నాను. ఈ విషయమై భారత ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉంది." అని అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్‌ అన్సారీ ఇరాన్‌లో భారత రాయబారిగా ఉన్నప్పుడూ జాతీయ ప్రయోజనాలకు రాజీ పడ్డారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను ఖండించారు. తాను టెహ్రాన్‌లో పనిచేసిన తర్వాత యూఎన్‌ఎస్‌సీకి భారత శాశ్వత ప్రతినిధిగా సేవలందించానని, తనకు భారత్‌లోనూ, విదేశాల్లోనూ గుర్తింపు ఉందని నొక్కి చెప్పారు.

(చదవండి: నేను గెలవలేదు!... నా డబ్బులు వెనక్కిచ్చేయండి!...ప్రజలకు బెదిరింపులు)

మరిన్ని వార్తలు