ఫుడ్‌ డెలివరీ సంస్థల్లో ఆర్డర్‌ పెడుతున్నారా.. మోసమంటూ పోస్టు వైరల్‌!

6 Jul, 2022 16:12 IST|Sakshi

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జోమాటో ఎంతో ఫేమసో అందరికీ తెలిసిందే. ఫుడ్‌ ఆర్డర్ల విషయంలో కస్టమర్లు జోమాటోతో పాటు ఇతర సంస్థలను ఎంచుకుంటుంటారు. కాగా, జోమాటో ఆర్డర్లపై ఓ కస్టమర్‌ షాకింగ్‌ విషయాలు వెలుగులోకి తెచ్చాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. 

వివరాల ప్రకారం.. రాహుల్ కబ్రా అనే ఒక లింక్డ్‌ఇన్ యూజర్‌.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఫుడ్ ఆర్డర్ బిల్లులను పోల్చుచూ ఓ పోస్టును పెట్టాడు. అందులో భాగంగా ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో వినియోగదారుల నుంచి ఎక్కువ వసూలు చేస్తోందని అతడు పేర్కొన్నాడు. ఈ క్రమంలో రెండింటి మధ్య ధరల డిఫరెన్స్‌ను గమనించి ఖంగుతిన్నాడు. ఈ క్రమంలోనే ఛార్జీల పేరుతో డెలివరీ సంస్థలు వినియోగదారులను దోచుకుంటున్నాయని ఆరోపించాడు.

కాగా, అతని ఆర్డర్‌లో వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలు ఉన్నాయి. ఆఫ్‌లైన్ ఆర్డర్‌ బిల్లు సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీతో కలుపుకుని రూ.512 అయింది. అయితే, ఇదే ఆర్డర్ జోమాటోలో రూ.689.90 ఉంది. అది కూడా రూ. 75 డిస్కౌంట్‌ ఇచ్చిన తర్వాత ఉండటం విశేషం. ఆ క్రమంలో జోమాటో 34.76% ఎక్కువ (రూ.178) వసూలు చేసినట్లు రాహుల్‌ తెలిపాడు. ఈ సందర్భంగా.. రాహుల్‌ కబ్రా డెలివరీ సంస్థలపై ఆగ్రహం వ్యక్తపరిచాడు. డెలివరీ సంస్థల బిల్లులపై ప్రభుత్వం ఫోకస్‌ చేయాల్సిన అవసరముందన్నాడు. అధిక ఛార్జీల పెరుగుదలను ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తద్వారా అందరికీ ఉపయోగం ఉంటుందని తెలిపాడు. భవిష్యత్తులో వినియోగదారులు జోమాటో వసూలు చేస్తున్న అధిక ఖర్చులను వినియోగదారులు అర్థం చేసుకుంటారని అన్నాడు. 

రాహుల్‌ కబ్రా పోస్టుపై మరో నెటిజన్‌ స్పందిస్తూ.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్విగ్గి ఆర్డర్‌పై తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ‘‘నేను సమీపంలోని రెస్టారెంట్ నుండి థాలీని ఆర్డర్ చేయాలనుకున్నాను. స్విగ్గీలో ధరను 120 ప్లస్ డెలివరీ ఛార్జీలుగా చూపింది. కానీ, నేను అదే రెస్టారెంట్ వైపు వెళ్తున్నా కారణంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ కాకుండా డైరెక్ట్‌గా రెస్టారెంట్ నుండి తీసుకున్నాను. దీంతో, అదే థాలీ రూ. 99కి వచ్చింది. అదే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి ఉంటే.. 40% ఎక్కువ ఉన్న అదే ఆహారం కోసం నేను స్విగ్గీకి దాదాపు 140 చెల్లించాల్సి వచ్చేదని అన్నాడు. 

కాగా, ఆయన పోస్టుపై రాహుల్‌ కాబ్రా.. నెటిజన్ల స్పందన ఏమిటో తెలపండి అంటూ కోరాడు. దీంతో, కొందరు నెటిజన్లు.. కంపెనీ ఇస్తున్న సర్వీసు వల్ల కొంత ఎక్కువ ఛార్జ్ చేస్తే తప్పేంటి, వారు చేస్తున్నదీ వ్యాపారమేగా అని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకించారు. మరొక యూజర్ ఈ యాప్‌లను తన ఫోన్ల నుంచి డిలీట్ చేసి పక్కనే ఉండే రెస్టారెంట్లకు వెళ్లి తినటం మంచిదని బదులిచ్చాడు.

ఇది కూడా చదవండి: గూగుల్‌ని తిట్టిపోస్తున్న నెటిజన్లు...నివాళి ఇచ్చే పద్ధతి ఇదేనా!

మరిన్ని వార్తలు