డిజిటల్‌ దేశభక్తి: మువ్వన్నెల జెండాతో ఐదు కోట్ల మందికి పైగా సెల్ఫీల రికార్డు

16 Aug, 2022 07:15 IST|Sakshi

ఢిల్లీ: కోట్లాదిమంది పౌరులు తమ దేశభక్తిని డిజిటల్‌ రూపంలోనూ చూపించారు. తాము ఎగరేసిన త్రివర్ణ పతాకంతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగి హర్‌ ఘర్‌ తిరంగా వెబ్‌సైట్‌కు పంపాలని ఇటీవల కేంద్ర సాంస్కృతిక శాఖ పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు స్పందన అనూహ్యరీతిలో వచ్చింది.

ఏకంగా ఐదు కోట్లకుపైగా పౌరులు త్రివర్ణ పతాక సెల్ఫీలను ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్‌ చేశారని సాంస్కృతిక శాఖ సోమవారం పేర్కొంది.  ‘ఇళ్ల వద్ద జెండావిష్కరణ జరపాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు వచ్చిన స్పందన అనుపమానం. కోటానుకోట్ల స్వీయచిత్రాలతో వెబ్‌సైట్‌ నిండిపోతోంది.

సోమవారం సాయంత్రం నాలుగింటికే ఐదు కోట్ల మార్క్‌ దాటాం’ అని పౌరులను అభినందించింది.  మంగళవారం ఉదయం కూడా వెబ్‌సైట్‌లోకి ఫోటోలు అప్‌లోడ్‌ అవుతుండడం విశేషం. సాధారణంగా అధిక జనాభా ఉన్న(రెండో దేశం) భారత్‌ నుంచి.. ప్రపంచ స్థాయిలోనే ఇదొక కొత్త రికార్డు అయ్యి ఉంటుందని సాంస్కృతిక శాఖ అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి: స్వాతంత్ర వేడుకల్లో గాంధీ ఎందుకు పాల్గొనలేదో తెలుసా?

మరిన్ని వార్తలు