డిజిటల్‌ వేడుక: వీళ్ల పెళ్లికి వినూత్నంగా విందు భోజనం!

18 Jan, 2022 18:20 IST|Sakshi

ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఉధృతి నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించుకోవడానికి వీలులేదు. పైగా అధికారులు కూడా ఎలాంటి వేడుకలు నిర్వహించుకోవడానికి వీల్లేదంటూ కఠినమైన కరోనా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఒక జంట విన్నూతనమైన ఆలోచనతో తమ పెళ్లిని జరుపుకోవాలనుకున్నారు. అంతేకాదు తమ పెళ్లిని తమవారంతా చూసేలా సరికొత్త ఆలోచన చేశారు.

అసలు విషయంలోకెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కి చెందిన సందీపన్ సర్కార్, అదితి దాస్ అనే జంట జనవరి 24న వివాహం చేసుకోనున్నారు. అయితే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించకుండా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పెళ్లికి అతిథులు హాజరయ్యేందుకు ‘గూగుల్‌ మీట్‌’ని, భోజనాల కోసం జొమాటో యాప్‌ను( ఫుడ్‌ ఆర్డర్లు) వినియోగించనున్నారు. పైగా ప్రత్యక్షంగా పెళ్లిని చూసేలా లైవ్‌ టెలికాస్ట్‌ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ ఉపయోగిస్తున్నారు.

అయితే కరోనా దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ విధించిన నిబంధనలకు లోబడి 120 మంది అతిధులు నేరుగా పెళ్లికి హాజరవుతారు. కాగా మిగతా 300 మంది డిజిటల్‌ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తారు. ఆహ్వానితులందరికీ వేడుకకు ఒక రోజు ముందు పాస్‌వర్డ్‌లతో పాటు వివాహాన్ని చూడటానికి లింక్‌ను కూడా అందిస్తారు.

ఈ క్రమంలో ఆ జంట మాట్లాడుతూ.. ‘మేము గతేడాది వివాహం చేసుకోవాలనుకున్నాం. కానీ కరోనా అడ్డంకిగా మారింది. అందుకే మా కుటుంబ భద్రత, అతిధుల భద్రత దృష్ట్యా డిజిటల్‌ వివాహాన్ని నిర్వహించాలనే ఆలోచన చేశాము’ అని తెలిపారు. ఈ మేరకు జొమాటో అధికారి మాట్లాడుతూ.. ‘ఈ ఆలోచన చాలా ప్రసంశించదగ్గది. పైగా మాకు ఈ కొత్త ఆలోచన బాగా నచ్చింది. ఈ వివాహాలను స్వాగతిస్తున్నాం. అంతేకాదు ఇలాంటి వివాహాలను పర్యవేక్షించేందుకు ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశాం’ అని చెప్పారు.

(చదవండి: ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్‌డ్‌ సర్జరీకి ప్రతీక!)

మరిన్ని వార్తలు