రైతు దీక్షలు.. సింగర్‌ కోటి సాయం

6 Dec, 2020 11:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని నడిబొడ్డున రైతులు చేపట్టిన దీక్షలకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ నెల 8న తలపెట్టన భారత్‌ బంద్‌కు ఇప్పటికే విపక్ష పార్టీతో సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం మద్దతు ప్రకటించారు. పదిరోజులుగా ఢిల్లీ నడిరోడ్డుపై చలిలో దీక్షలు నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావం తెలియజేస్తున్నారు. న్యాయబద్ధమైన రైతుల డిమాండ్స్‌ను నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు రైతులకు అండగా బియ్యం, దుస్తులు, కూరగాయలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రైతుల దీక్షలకు మద్దతు ప్రకటించిన పంజాబ్‌ నటుడు, ప్రముఖ సింగర్‌ దిల్జిత్‌ దోసంజ్‌ మరోసారి వారికి అండగా నిలిచారు. చలిలో గత పదిరోజులుగా నిరసన తెలుపుతున్న రైతులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. రైతులకు మద్దతుగా ప్రజాసంఘాలు, నాయకులు ముందుకు రావాలని కోరారు. (రైతుల దీక్షకు సీఎం కేసీఆర్‌ మద్దతు)

కాగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వ్యవసాయ కార్మికులపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై దిల్జిత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాము యూపీ వాలా కాదని, పంజాబ్‌ రైతులమని గట్టి కౌంటరిచ్చారు. ఈ క్రమంలోనే వారిద్దమరి మధ్య సోషల్‌ మీడియా వేదికగా మాటల యుద్ధం సాగింది. మరోవైపు రైతులతో కేంద్రం జరిపిన ఐదో విడత చర్చలు విఫలమైన నేపథ్యంలో దీక్షలను కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్త బంద్‌కు విపక్షాలతో పాటు ప్రజాసంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. (చర్చల్లో ప్రతిష్టంభన.. పట్టువీడని రైతులు)

మరిన్ని వార్తలు