దివ్యాంగురాలిపై లైంగిక దాడి, చూపు కోల్పోయిన బాలిక

13 Jan, 2021 14:42 IST|Sakshi

బిహార్‌: దివ్యాంగురాలు అని కూడా చూడకుండా 15 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా గాయపర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బిహార్‌లోని మధుబాన్‌ జిల్లాలో బుధవారం జరిగింది. మధుబాన్‌ జిల్లా ఎస్పీ సత్యప్రకాశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హర్లకి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కౌవహ బర్హి గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన (చెవిటి, మూగ) బాలిక (15) తన స్నేహితులతో కలిసి మేకల్ని తోలుకొని అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వెంట పడి బాలికను లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

దాంతో తోటి బాలికలు వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి ఆ బాలిక తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉంది. దుండగుల దాడిలో ఆ బాలిక కంటిచూపు కోల్పోయింది. బాధితురాలిని మధుబానీలోని సదర్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ పాశవిక దాడి ఘటనపై బిహార్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఘటనను ఖండిస్తున్నాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు