ఆగస్టు 15 లోపు కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి?

9 Aug, 2022 14:53 IST|Sakshi

బెంగళూరు: 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ, ప్రభుత్వంలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయని కర్ణాటక బీజేపీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మార్పులు ఉండబోతున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు మాజీ ఎమ్మెల్యే బీ సురేశ్‌ గౌడ. ముఖ‍్యమంత్రి మార్పు సహా ఇతర అంశాలపై హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే.. మార్పు ఉంటుందా? ఉండదా అనే అంశంపై స్పష్టత లేదన్నారు. కానీ, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు. 

‘రాష్ట్రంలో ఏదైనా మార్పు జరిగితే అది ఆగస్టు 15లోపే జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ మార్పులు ఉండబోతున్నాయి. 2023లో రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావటం, 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావటమే లక్ష్యం. ఏ సమయంలోనైనా పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు.’ అని పేర్కొన్నారు గౌడ. మరోవైపు.. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మంచి పనితీరు కనబరుస్తున్నారని తెలిపారు. ఏడాది పదవీ కాలంలో చాలా మంచి పనులు చేశారని, అయితే.. పార్ట ఏ నిర్ణయం తీసుకున్నా దానిని అనుసరిస్తామన‍్నారు. 

ఎన్నికలకు కొద్ది నెలల ముందు ముఖ్యమంత్రులను మార్చే ఆనవాయితీ బీజేపీలో కొనసాగుతోందన్నారు తుమకూరు రూరల్‌ మాజీ ఎమ్మెల్యే. అయితే, ఆ నిర్ణయం కేంద్ర నాయకత్వం చేతిలో ఉంటుందన్నారు. ఇటీవల రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన అనంతరం బీజేపీలో ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీలో ముఖ్యంగా ఉ‍న్నత స్థాయిలో ఈ మార్పులు ఉండబోతున్నాయని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరోవైపు..కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభ కరండ్లేజ్‌ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందా? అని అడగగా.. అది మీడియా క్రియేషన్‌గా పేర్కొన్నారు గౌడ.

ఇదీ చదవండి: CM Nitish Kumar: నితీశ్‌లో ఎందుకీ అసంతృప్తి?

మరిన్ని వార్తలు