వెలుగు దివ్వెల దీపావళి
సాక్షి, హైదరాబాద్: దీపావళి అంటే వెలుగులు విరజిమ్మే దీపాలు. సరదాలు..సంబరాలు. చిచ్చర పిడుగుల ముఖాల్లో సంతోషాల మతాబులు. పిండివంటల ఘుమ ఘుమలు. కొత్తబట్టలు, కొత్త అల్లుళ్లు. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దాజరుపుకునే దీపకాంతుల పండగే దీపావళి. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే వెలుగు దివ్వెల పండుగ దీపావళి సందర్భంగా మా ప్రియమైన పాఠకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
జాతి కుల మత వర్గ విచక్షణలేకుండా సర్వమానవ సౌభ్రాతృత్వంతో దశ దిశలా చాటే పండుగే దీపావళి పండుగ. భారతదేశ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే పండుగల్లో మరో విశిష్టమైన పండుగ దీపావళి. కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి రోజున జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ధంతేరస్, నరక చతుర్దశి, దీపావళి, గోవర్ణన్ పూజ, భాయ్ దూజ్ ఇలా ఐదు రోజుల పాటు దీపావళి వేడుక సాగుతుంది.
లోకాన్ని పీడించిన నరకాసురుడి పీడ విరగడైనందుకు గుర్తుగా ఈ పండుగ చేసుకుంటున్నామనేది ప్రాచుర్యంలో ఉంది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ తర్వాతి రోజు దీపావళి. అయితే దీపావళికి సంబంధించి చాలా పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భమని ఒక కథ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగా, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగా ఈ దీపావళి సంబరాన్ని చేసుకుంటారు. అంతేకాదు తమకు కలిగిన దాంట్లో తృణమో, ఫణమో ఇతరులకు దానం చేయడం కూడా మనకు అలవాటు.