నువ్వు సైనికుడివా అయితే ఏంటి.. నన్ను ఏమీ చేయలేవు: రెచ్చిపోయిన డీఎంకే లీడర్‌

16 Feb, 2023 18:08 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అధికార డీఎంకే పార్టీకి చెందిన కౌన్సిలర్‌ రెచ్చిపోయాడు. భారత ఆర్మీ​కి చెందిన సైనికుడిపై దాడి చేయడంతో గాయపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనలో డీఎంకే కౌన్సిలర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, మృతుడి సోదరుడు కూడా సైనికుడే కావడంతో కౌన్సిలర్‌పై చర్యలు తీసుకునే వారకు తాను విధుల్లో​ చేరనని తెగేసి చెప్పాడు.

వివరాల ప్రకారం.. తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన భారత ఆర్మీ సైనికుడు ప్రభు, అతడి అన్ని ప్రభాకర్‌.. ఫిబ్రవరి 8వ తేదీన పోచంపల్లిలో ప్రాంతంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ వద్ద బట్టలు ఉతికారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న డీఎంకే కౌన్సిలర్‌ చిన్నస్వామి.. వారితో వాదనకు దిగారు. ఇక్కడ బట్టలు ఎందుకు వాష్‌ చేస్తున్నావ్‌ అంటూ వారిద్దర్నీ ప్రశ్నించారు. దీంతో, వారి మధ్య వాదనలు పెరిగాయి. అయితే, ఇదే సమయంలో కొందరు వ్యక్తులు.. అక్కడే కార్లు వాష్‌ చేయడం, మరో ఇద్దరూ కూడా బట్టలు వాష్‌ చేస్తున్నారు. అయినప్పటికీ చిన్నస్వామి.. వీరిద్దరితో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభు బద్రర్స్‌తో దురుసుగా మాట్లాడుతూ.. మీరు సైనికులు కావొచ్చు కానీ.. నన్ను మీరు ఏమీ చేయలేరని వార్నింగ్‌ ఇచ్చాడు. అనంతరం.. ఆగ్రహానికి లోనైన చిన్నస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 

అదే రోజు రాత్రి కౌన్సిలర్‌ చిన్నస్వామి, అతడి అనుచరులు కలిసి ప్రభు ఇంటిపై దాడి చేశారు. ప్రభు కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా.. చిన్నస్వామి తన అనుచరులతో వారిపై కత్తితో దాడికి దిగాడు. ప్రభును రక్షించే క్రమంలో కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు. అయితే, ప్రభు తలపై కత్తితో వేటువేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, అతడిని వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. ఈ క్రమంలో గాయాల కారణంగా ఆరోగ్యం విషమించి ప్రభు.. మంగళవారం అకాల మరణం చెందాడు. కాగా, ప్రభు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. కౌన్సిలర్‌ చిన్నస్వామిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగానే మరో సైనికుడు ప్రభాకర్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. తన అన్నను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు తాను విధుల్లోకి వెళ్లే ప్రసక్తిలేదని తెలిపారు. న్యాయం కోసం డిమాండ్‌ చేశాడు.

మరిన్ని వార్తలు