కరుణానిధి కుమార్తెకు కరోనా.. ఆందోళనలో డీఎంకే

3 Apr, 2021 20:22 IST|Sakshi

చెన్నె: స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉండడం.. అధికారంలోకి దూరమై పదేళ్లు కావడంతో ఈసారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వీలైనంత ఎక్కువగా ప్రచార కార్యక్రమాల్లో మునిగారు. రోజు భారీ బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యం పాలయ్యారు. ఆమెకు తాజాగా కరోనా వైరస్‌ సోకింది. తాజాగా చేసుకున్న పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌ తేలింది. 

డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి ముద్దుల కూతురు కనిమొళి. ఆమె తూత్తుకుడి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన సోదరుడు డీఎంకే అధినేత స్టాలిన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు శక్తి మేర కష్టపడుతున్నారు. ఈ క్రమంలో విస్తృత పర్యటనలు చేయడం.. ప్రజలను కలవడం చేయడంతో ఆమెకు కరోనా సోకింది. పాజిటివ్‌ తేలిన వెంటనే ఆమె ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అయితే ఆమె చెన్నెలోని అపోలో ఆస్పత్రి చేరినట్లు తెలుస్తోంది. ఆమెకు కరోనా సోకిన విషయం తెలియగానే ఆమె సోదరుడు స్టాలిన్‌ ఆమె ఆరోగ్య వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల పాటు ఆమె ఎన్నికల ప్రచారానికి దూరం ఉండనున్నారు. స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న కనిమొళి కరోనా సోకడంతో డీఎంకే ఆందోళనలో పడింది. 

చదవండి: ప్రసంగం ఆపి వైద్యులను పంపిన ప్రధాని

మరిన్ని వార్తలు