బెట్టింగ్‌ సైట్ల ప్రకటనలొద్దు టీవీ చానళ్లకు కేంద్రం సూచన

4 Oct, 2022 05:54 IST|Sakshi

న్యూఢిల్లీ: బెట్టింగ్‌ సైట్లకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల ప్రసారంపై కేంద్రం సోమవారం మార్గదర్శకాలను విడుదలచేసింది. ‘ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సైట్లను వాటికి సంబంధించిన వార్త వెబ్‌సైట్లను, వాటి ఉత్పత్తులు/సేవల సంబంధ అంశాలను చూపే వాణిజ్య ప్రకటనల ప్రసారం మానుకోండి’ అని న్యూస్‌ వెబ్‌సైట్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ప్రైవేట్‌ శాటిలైట్‌ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం సూచించింది. ఈ మార్గదర్శకాలు, చట్టాన్ని అతిక్రమిస్తే తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని ప్రైవేట్‌ శాటిలైట్‌ చానళ్లను కేంద్రం హెచ్చరించింది.

వార్తలను ప్రచురించే పబ్లిషర్లకు, డిజిటల్‌ మీడియాకూ ఇదే తరహా సూచనలిస్తూ విడిగా మార్గదర్శకాలను పంపింది. ‘సొంత న్యూస్‌ వెబ్‌సైట్ల మాటున కొన్ని బెట్టింగ్‌ సంస్థలు తమను తాము అడ్వర్‌టైజ్‌ చేసుకుంటున్నాయి. బెట్టింగ్‌ సంస్థల లోగోలే ఆ న్యూస్‌ వెబ్‌సైట్లకూ ఉంటున్నాయి. ఈ వెబ్‌సైట్లు ఏవీ భారత చట్టాలకు లోబడి అధీకృత యంత్రాంగం వద్ద రిజిస్టర్‌ కాలేదు. తప్పుడు వాణిజ్య ప్రకటనలు, వార్తలు ప్రసారం చేస్తూ బెట్టింగ్, గ్యాబ్లింగ్‌కు పాల్పడుతున్నాయి. వీటిలో కొన్ని ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ బ్లాగ్‌లు, క్రీడా వార్తల వెబ్‌సైట్లుగా చెలామణి అవుతున్న విషయంపై వినియోగదారుల వ్యవహారాల విభాగాన్ని అప్రమత్తం చేశాం’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు