డాక్టర్‌ మృతి, 80 మంది సిబ్బందికి కరోనా

9 May, 2021 16:09 IST|Sakshi

టీకా తీసుకున్న దక్కని ప్రాణం

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నాం. ఇక మాకేం కాదనుకుంటే పొరపాటే. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతి.  సరోజ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ ఎకె రావత్‌(58) కోవిడ్‌ వ్యాక్పిన్‌ తీసుకున్నప్పటికీ  కరోనా సోకడంతో శనివారం మరణించారు. ‘ఏప్రిల్‌,మే ఈ రెండు నెలల వ్యవధిలోనే సరోజ్‌ ఆస్పత్రిలోని సుమారు 80 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారని, రావత్‌ తన జూనియర్‌ డాక్టర్‌ అని, చాలా ధైర్యవంతుడు’ అని డాక్టర్ భరద్వాజ్ అన్నారు. ‘నేను వ్యాక్పిన్‌ తీసుకున్నాను. నాకేం కాదు’ అని రావత్‌ తనతో అన్న చివరి మాటలను డాక్టర్‌ భరద్వాజ్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

పెరుగుతున్న కేసులు... ఆందోళనలో ఆస్పత్రులు
ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరగడంతో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో ఆక్సిజన్‌ నిల్వలు లేవని, కోవిడ్‌ రోగులకు చికిత్స అందించడానికి వెంటనే ఆక్సిజన్‌ సరఫరా చేయాలని గత నెల ప్రైవేట్‌ ఆస్పత్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉందని, కానీ మళ్లీ ఆక్సిజన్‌ ఎప్పుడు వస్తుందో తెలియని గందరగోళం నెలకొందని ఢిల్లీకి చెందిన చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

కాగా, ఆక్సిజన్‌ లభ్యత, దాని పంపిణీని అంచనా వేయడానికి 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు శనివారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా కేసులు రోజుకి పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మే17 వరకు పొడగించిన ఢిల్లీ ప్రభుత్వం.. నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు మెట్రో సేవలను నిలిపివేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. 

(చదవండి: ‘ఎంజాయ్‌ ఎంజామీ’ అంటోన్న చెన్నై మహిళా పోలీసులు)

>
మరిన్ని వార్తలు