అస్సాంలో దారుణం.. ఆల‌స్యంగా వెలుగులోకి

6 Sep, 2020 11:47 IST|Sakshi

గౌహ‌తి : అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడి ముఖంపై  వైద్య దంప‌తులు వేడి నీళ్లు పోసి త‌మ మూర్క‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఈ ఘ‌ట‌న జ‌రిగి వారం రోజులైన‌ప్పటికి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కాగా  ఈ ప‌ని చేసిన ఆ దంపతుల‌ను శ‌నివారం రాత్రి  నాగాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివ‌రాలు..   సిద్ధి ప్ర‌సాద్ దేరి అస్సాం మెడిక‌ల్ కాలేజీలో డాక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. ప్ర‌సాద్ భార్య మిథాలి కొన్వార్ మోర‌న్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప‌ని చేస్తున్నారు. డిబ్రూగ‌ర్‌లో నివాసం ఉంటున్న ఈ దంపతుల ఇంట్లో 12 ఏళ్ల బాలుడితో ఇంటి ప‌నులు చేయిస్తున్నారు.

ఆగ‌స్టు 29న‌ ఇంట్లోనే ఉన్న ప్ర‌సాద్ ఇంటికి సంబంధించిన ప‌నిమీద బాలుడిని పిలిచాడు. అయితే బాలుడు రాక‌పోవ‌డంతో అత‌ను ఉన్న గ‌ది ద‌గ్గ‌ర‌కు వెళ్లి చూడ‌గా నిద్ర‌పోతూ క‌నిపించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ప్ర‌సాద్ ప‌ని చేయ‌కుండా హాయిగా నిద్ర‌పోతున్నావా అంటూ వేడినీళ్లు బాలుడి ముఖం మీద గుమ్మ‌రించాడు. ఈ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న మిథాలి భ‌ర్త చేస్తున్న ప‌నిని అడ్డుకోక‌పోగా.. క‌నీసం అత‌నికి ఫ‌స్ట్ ఎయిడ్ కూడా చేయ‌లేదు.  వేడినీళ్లు ప‌డ‌డంతో ఆ బాలుడు రాత్రంతా న‌ర‌కయాత‌న అనుభ‌వించాడు.(చ‌ద‌వండి : శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఆఫ్రికన్‌ అరెస్టు)

ఈ సంఘ‌టన మొత్తాన్ని ఒక వ్య‌క్తి వీడియో తీసి దానిని డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీకి ఫార్వ‌ర్డ్ చేశాడు. విష‌యం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ పోలీసుల‌కు స‌మాచారం అందించింది. పోలీసులు రంగంలోకి దిగి వైద్య దంప‌తులు ఉంటున్న ఇంటికి వెళ్లి బాలుడిని సంర‌క్ష‌ణ కేంద్రానికి త‌ర‌లించి వారిద్ద‌రిని అరెస్ట్ చేశారు. బాలుడి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు ఆ దంప‌తుల‌పై బాల‌ల హ‌క్కు చ‌ట్టంతో పాటు ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు అడిష‌న‌ల్ డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. 

మరిన్ని వార్తలు