డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం

5 Feb, 2021 21:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇకపై డ్రైవింగ్‌ టెస్ట్‌ లేకుండానే లైసెన్స్‌లు జారీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. పౌరులకు డ్రైవింగ్‌లో నాణ్యతతో కూడిన శిక్షణను అందించేందుకు డ్రైవర్‌ శిక్షణా కేంద్రాలకు నిర్ధిష్టమైన అర్హతలతో కూడిన ముసాయిదాను రూపొందించింది. ఈ కేంద్రాల్లో డ్రైవింగ్‌ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి టెస్ట్‌ లేకుండానే డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఇది రవాణా పరిశ్రమకు సుశిక్షితులైన డ్రైవర్లను అందించేందుకు తోడ్పడుతుందని, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుందని రవాణా మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి పైగా తగ్గించాలనే ధ్యేయంతో రవాణా  శాఖ ఈ ముసాయిదాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇటీవల కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ముసాయిదాను రూపొందిస్తుందంటూ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు