Drone Attack Jammu: మరో ఉగ్రకుట్ర భగ్నం

29 Jun, 2021 04:09 IST|Sakshi
గాలింపు కోసం తరలి వెళ్తున్న జవాన్లు

జమ్మూకశ్మీర్‌ రత్నుచుక్‌–కలుచక్‌ సైనిక స్థావరంపై డ్రోన్లతో దాడికి యత్నం

తిప్పికొట్టిన భద్రతా సిబ్బంది.. వెనక్కి పరారైన డ్రోన్లు

సైనికుల అప్రమత్తతతో తప్పిన పెద్ద ప్రమాదం

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల సాయంతో ప్రయత్నించిన మరో ఉగ్రకుట్రను భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన కొన్ని గంటల్లోనే అదే తరహా ఘటన పునరావృతమవడం సంచలనం రేపింది. ఈసారి సైనిక స్థావరాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు.

రెండు డ్రోన్లతో దాడికి ప్రయత్నించారు. ఆర్మీ జవాన్లు అప్రమత్తమై ఎదురుదాడికి దిగడంతో డ్రోన్లు తోకముడిచాయి. జమ్మూకశ్మీర్‌లోని రత్నుచక్‌–కలుచక్‌ సైనిక స్థావరం వద్ద ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్,› సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు మరో డ్రోన్‌ సైనిక స్థావరం వైపు దూసుకొచ్చాయని తెలిపారు. వాటిని నేలకూల్చడానికి విధుల్లో ఉన్న సెంట్రీలు దాదాపు రెండు డజన్ల రౌండ్లు కాల్పులు జరపడంతో డ్రోన్లు వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్మీ పీఆర్‌ఓ లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేందర్‌ ఆనంద్‌ వివరించారు.

ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రత్నుచక్‌–కలుచక్‌ ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించినట్లు తెలిపారు. డ్రోన్ల కోసం చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో భూభాగంపై అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని అన్నారు. మన సైనిక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.     రత్నుచక్‌–కలుచక్‌ మిలటరీ స్టేషన్‌పై 2002లో ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ దాడిలో 31 మంది మరణించారు. వీరిలో ముగ్గురు సైనిక సిబ్బందితోపాటు వారికి కుటుంబ సభ్యులు, సాధారణ పౌరులు ఉన్నారు. అలాగే 48 మంది గాయపడ్డారు. ఈ దాడి జరిగినప్పటి నుంచి రత్నుచక్‌–కలుచక్‌ సైనిక స్థావరానికి ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు.

కశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం
శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో నిషేధిత జైషే మొహమ్మద్‌(జేఈఎం) ముష్కరులు రెచ్చిపోయారు. ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్పీవో)తోపాటు ఆయన భార్య, కుమార్తె ప్రాణాలను బలిగొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపుర ప్రాంతంలో ఉన్న హరిపరిగామ్‌లో ఆదివారం రాత్రి 11 గంటలకు ఎస్పీవో ఫయాజ్‌ అహ్మద్, ఆయన భార్య రజా బేగం, కుమార్తె రఫియా(22) ఇంట్లో ఉండగా, ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించారు. వెంటనే తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఫయాజ్‌ అహ్మద్, ఆయన భార్య, కుమార్తెను ఆసుపత్రికి తరలించారు.

ఫయాజ్‌ అహ్మద్‌ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భార్య ఆదివారం రాత్రి, కుమార్తె సోమవారం ఉదయం మృతి చెందారు. ఎస్పీవో కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్న ముష్కరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కశ్మీర్‌ రేంజి ఐజీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. ఈ ఘాతుకంలో పాలుపంచుకున్న ఇద్దరిలో ఒకడు విదేశీయుడని అనుమానిస్తున్నట్లు తెలిపారు.  ఈ దారుణాన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి.  జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ధ్వజమెత్తారు. బాధ్యులను వెంటనే పట్టుకొని,  కఠిన శిక్ష విధించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో నిషేధిత జైషే మొహమ్మద్‌(జేఈఎం) ముష్కరులు రెచ్చిపోయారు. ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్పీవో)తోపాటు ఆయన భార్య, కుమార్తె ప్రాణాలను బలిగొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపుర ప్రాంతంలో ఉన్న హరిపరిగామ్‌లో ఆదివారం రాత్రి 11 గంటలకు ఎస్పీవో ఫయాజ్‌ అహ్మద్, ఆయన భార్య రజా బేగం, కుమార్తె రఫియా(22) ఇంట్లో ఉండగా, ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించారు. వెంటనే తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

రక్తపు మడుగులో పడి ఉన్న ఫయాజ్‌ అహ్మద్, ఆయన భార్య, కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. ఫయాజ్‌ అహ్మద్‌ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భార్య ఆదివారం రాత్రి, కుమార్తె సోమవారం ఉదయం మృతి చెందారు. ఎస్పీవో కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్న ముష్కరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కశ్మీర్‌ రేంజి ఐజీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. ఈ ఘాతుకంలో పాలుపంచుకున్న ఇద్దరిలో ఒకడు విదేశీయుడని అనుమానిస్తున్నట్లు తెలిపారు.  ఈ దారుణాన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి.  జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ధ్వజమెత్తారు. బాధ్యులను వెంటనే పట్టుకొని,  కఠిన శిక్ష విధించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

లష్కరే టాప్‌ కమాండర్‌ అరెస్ట్‌
ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ నదీమ్‌ అబ్రార్‌ను సోమవారం భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. భద్రతా సిబ్బందిపై, సాధారణ ప్రజలపై జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో, హత్యల్లో అతడి హస్తం ఉందని అధికారులు చెప్పారు. నదీమ్‌ అబ్రార్‌ను బలగాలు అదుపులోకి తీసుకోవడం తమకు పెద్ద విజయమని కశ్మీర్‌ జోన్‌ ఐజీ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శ్రీనగర్‌ శివారులోని పరింపురా చెక్‌పాయింట్‌ వద్ద నదీమ్‌ను అరెస్ట్‌ చేశారు. అబ్రార్‌తోపాటు మరో అనుమానితుడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వారి నుంచి ఒక పిస్టల్, గ్రనేడ్‌ స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో లవాయ్‌పురాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి కేసులో నదీమ్‌ అబ్రార్‌ నిందితుడు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.  

ఆ డ్రోన్లు జారవిడిచిన బాంబుల్లో ఆర్డీఎక్స్‌!
జమ్మూ ఎయిర్‌పోర్టు సమీపంలో భారత వాయుసేన(ఐఏఎఫ్‌) స్థావరంపై దాడికి ఉగ్రవాదులు ఆర్డీఎక్స్‌తో కూడిన పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముష్కరులు ఆదివారం తెల్లవారుజామున రెండు డ్రోన్లతో బాంబులను జారవిడిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన సిబ్బంది గాయపడ్డారు. ఈ బాంబుల్లో ఆర్డీఎక్స్‌తోపాటు మిశ్రమ రసాయనాలు ఉన్నట్లు అధికార వర్గాలు సోమవారం తెలిపాయి.  దీనిపై పూర్తి నివేదిక అందాల్సి ఉందన్నాయి. ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నది దర్యాప్తు సంస్థలు నిర్ధారించలేదు. ఎన్‌ఐఏ  ఘటనా స్థలం నుంచి సాక్ష్యాధారాలను సేకరిస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులే డ్రోన్లతో దాడికి దిగినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.   

మరిన్ని వార్తలు