సింప్లిసిటీ చాటుకున్న ద్రౌపది ముర్ము.. పలువురి ప్రశంసలు

22 Jun, 2022 10:33 IST|Sakshi

భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ జార్ఖండ్ మాజీ గవర్నర్, సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్ము పేరును ఫైనల్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆమె మరోసారి తన సింప్లిసిటీని చూపించుకున్నారు. అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. 

వివరాల ప్రకారం.. ద్రౌపది ముర్ము బుధవారం ఉదయం ఒడిషాలోని రాయ్‌రంగ్‌పూర్‌లోని శివాలయానికి వెళ్లారు. అనంతరం ఆమె.. చీపురు చేతపట్టి స్వతహాగా ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే, రాష్ట్రపతి రేసులో ఉన్న ఆమె.. ఇలా చీపురు పట్టుకుని శుభ్రం చేయడం అక్కడున్న వారితో సహా పలువురిని ఆశ్యర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ద్రౌపది ముర్ముకు కేంద్రం జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. నేటి నుంచి ఆమెకు సీఆర్పీఎఫ్ దళాలు భద్రత ఇవ్వనున్నాయి. ఇక, దేశానికి కాబోయే భారత రాష్ట్రపతి బీజేపీ సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికపై ప్రధాని మోదీ స్పందించారు. దేశానికి ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

‘ద్రౌపది ముర్ము సమాజ సేవకు, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. పరిపాలనపరమైన అపార అనుభవం ఆమెకు ఉంది. గవర్నర్‌గా అత్యుత్తమ సేవలం దించారు. ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకముంది’ అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘విధానపరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన, దయాస్వభావం దేశానికి ఎంతో ఉపకరిస్తాయి. పేదరికాన్ని, కష్టాలను అనుభవిస్తున్న కోట్లాది మంది ప్రజలు ద్రౌపది ముర్ము జీవితం నుంచి ప్రేరణ పొందుతారు’ అని ప్రధాని అన్నారు.  

ఇది కూడా చదవండి: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. అంచెలంచెలుగా ఎదిగిన ఆదివాసీ బిడ్డ

మరిన్ని వార్తలు