డ్రగ్స్‌ పెట్టి విదేశాలకు తరలించేందుకు యత్నం

10 Feb, 2021 15:33 IST|Sakshi

న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక రూపంలో మాదక ద్రవ్యాలు జనబాహుళ్యంలోకి వస్తున్నాయి. తాజాగా అమ్మాయి డ్రెస్‌లో డ్రగ్స్‌ పెట్టి విదేశాలకు ఎగుమతి చేయాలనుకున్నారు.  ఈ మేరకు డ్రెస్‌లో కోటి 70 లక్షల విలువైన డ్రగ్స్‌ పెట్టి తపాలా నుంచి ఆస్ట్రేలియాకు పంపించాలనుకున్న ప్రయత్నం బెడిసికొట్టింది. వారిని ఢిల్లీ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

ఢిల్లీకి చెందిన ఓ వ్య‌క్తి అంద‌మైన లెహెంగను ఆస్ట్రేలియాకు పంపేందుకు ఢిల్లీ సరిహద్దులోని నోయిడాలో ఉన్న విదేశీ పోస్టాఫీస్‌కు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నిఘా వ‌ర్గాలు పోస్టాఫీస్‌ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ఆయన తీసుకువచ్చిన లెహెంగాను పరిశీలించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఆ డ్రెస్‌ను నిశితంగా పరిశీలించగా అందులో రూ. కోటి 70 లక్షలు విలువ చేసే 3,900 గ్రాముల డ్ర‌గ్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇది చూసి అధికారులు ఖంగు తిన్నారు. డ్రగ్స్‌ స‌ర‌ఫ‌రా చేయడానికి  ప్ర‌య‌త్నించిన వ్య‌క్తిని క‌స్ట‌మ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు సరఫరా చేయాలనుకున్న డ్రగ్స్‌ చాలా ప్రమాదకరమని,  కాలేయం, మూత్ర‌పిండాలు, గుండెపై తీవ్ర ప్ర‌భావం చూపుతాయని అధికారులు తెలిపారు. మొత్తం 7 లెహెంగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్‌లో మూలాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు