కారు ఢీకొని విధుల్లో ఉన్న పోలీస్‌ మృతి.. రిటైర్‌మెంట్‌కు కొన్ని రోజుల ముందే

14 Jan, 2023 15:46 IST|Sakshi

న్యూఢిల్లీ: కారు ఢీకొట్టిన ఘటనలో విధుల్లో ఉన్న ఓ పోలీస్‌ అధికారి మృత్యువాతపడ్డారు. పదవీ విరమణకు కొన్ని రోజుల ముందు పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌  ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నిపింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఢిల్లీ నగరం నడిబొడ్డున చోటుచేసుకుంది. 59 ఏళ్ల లతూర్‌ సింగ్‌ సెంట్రల్‌ జిల్లాలోని  చందిని మహాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం రాత్రి రింగ్ రోడ్డులో రాజ్‌ఘాట్,శాంతివన్ సిగ్నల్స్ వద్ద వేగంగా వచ్చిన కారు లతూర్‌ సింగ్‌ను ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

ప్రమాద సమయంలో సింగ్‌ డ్యూటీలో ఉన్నట్లు సెంట్రల్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్వేతా చౌహన్‌ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాగంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రమాదానికి కారణమైన హర్యానా రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ కలిగిన హ్యుందాయ్‌ కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారుడ్రైవర్‌ను కూడా అరెస్ట్‌ చేశామని డీసీపీ తెలిపారు. నిందితుడిని శోకేంద్ర(34)గా గుర్తించారు. హర్యానాలోని సోనిపట్‌ జిల్లాకు చెందిన ఇతడు అసఫ్‌ అలీ రోడ్డులోని బ్యాంక్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు.

కాగా మృతుడు లతూర్‌ సింగ్‌ జనవరి 31న రిటైర్‌మెంట్‌ తీసుకోనున్నారని శ్వేతా చౌహన్‌ తెలిపారు. అతడికి భార్య ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడని పేర్కొన్నారు.  సింగ్‌ కుటుంబం దయాల్‌పూర్‌లో నివసిస్తుందని, వారికి ప్రమాదంపై సమాచారం ఇచ్చిన్నట్లు చెప్పారు. 
చదవండి: నితీష్‌ రాముడిగా, మోదీ రావణుడిలా.. కలకలం రేపుతున్న పోస్టర్లు

>
మరిన్ని వార్తలు