సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి విస్తృత మార్గదర్శకాలను జారీ చేసే అంశంపై మంగళవారం జరిగిన సమావేశంలో చర్చించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీలు ఇచ్చిన అభిప్రాయాలు, సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్టు వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులు చేసిన సూచనలు, సిఫారసులను కూడా పరిశీలిస్తున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ఇవన్నీ పరిశీలించిన తరువాత, మూడు రోజుల్లో విస్తృత మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించినట్టు ఎన్నికల కమిషన్ అధికారిక ప్రతినిధి షెఫాలి శరణ్ అన్నారు. ఈ మార్గదర్శకాల ఆధారంగా, ఎన్నికలు జరిగే రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, కోవిడ్-19 సంబంధిత చర్యలకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని, ఎన్నికల నిర్వహణ సమయంలో స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది. ముఖ్యంగా బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం వంటి అనేక రాష్ట్రాలలో ఈ ఏడాది చివర్లో, 2021లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.
చదవండి: ఎన్నికల కమిషనర్గా వైదొలగిన అశోక్ లావాస