ప.బెంగాల్‌, తమిళనాడు, కేరళలో వేడెక్కనున్న రాజకీయం

10 Feb, 2021 17:38 IST|Sakshi

మొదలైన ఈసీ రాష్ట్రాల పర్యటన

అనంతరం షెడ్యూల్‌ వెలువడే అవకాశం

న్యూఢిల్లీ: మరో ఎన్నికల సమరం దూసుకురానుంది. మినీ సమరంగా పేర్కొనే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 15 తర్వాత రానున్నాయని సమాచారం. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం దక్షిణాది పర్యటన చేపట్టింది. ఈసీ పర్యటన ఈనెల 15వ తేదీ వరకు కొనసాగనుంది. పర్యటన ముగిసిన అనంతరం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటన వెలువడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఎన్నికలు రెండు నెలల్లో రానున్నాయి. మొత్తం మూడు నెలల్లో ముగించేలా ఎన్నికల సంఘం ప్రణాళిక రచిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 15 తర్వాత ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల సంసిద్ధతను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన మొదలుపెట్టింది. ఆ పర్యటన ఈనెల 15వ తేదీతో ముగియనుంది. దీని తరువాత నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. పది, 12వ తరగతులకు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్ష ప్రారంభమయ్యే లోపు  అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసే యోచనలో ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్‌తో కూడిన ఎన్నికల సంఘం బృందం ఆరు రోజుల (ఫిబ్రవరి 10 నుంచి 15వ తేదీ) పాటు నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటిస్తోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి ఒకే దశలో, అస్సాంలో పలు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే పెద్ద రాష్ట్రం, రాజకీయంగా హాట్‌హాట్‌గా ఉండే పశ్చిమ బెంగాల్‌లో మాత్రం దాదాపు 8 దశల్లో నిర్వహించే యోచనలో ఉంది. ఈ ఎన్నికలన్నీ ఒకే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఈ మేరకు కొద్ది రోజుల్లో ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లో రాజకీయ వేడి రగులుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రకటన వెలువడితే మినీ సమరం ప్రారంభం కానుంది. తమిళనాడులో కూడా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాలతో పాటు శశికళ రాకతో కాక రేపింది. ఈ రెండు తర్వాత కేరళపై ప్రధాన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 

సుశాంత్ సింగ్ కజిన్‌ మంత్రి అయ్యాడు

మంత్రులుగా 17 మంది ప్రమాణం

మరిన్ని వార్తలు