అనిల్‌ దేశ్‌ముఖ్‌కు షాక్‌: రూ. 4 కోట్లు విలువైన ఆస్తుల జప్తు

16 Jul, 2021 16:32 IST|Sakshi
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ (ఫైల్‌ ఫోటో)

ఈడీ దర్యాప్తుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్న అనిల్‌ దేశ్‌ముఖ్‌

ముంబై: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఈడీ భారీ షాక్‌ ఇచ్చింది. మనీ లాండరింగ్‌ కేసులో భాగాంగా అనిల్‌ దేశ్‌ముఖ్‌కు సంబంధించి సుమారు 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను శుక్రవారం ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద తాత్కాలిక అటాచ్మెంట్ ఆర్డర్ జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్‌లో జప్తు చేసిన ఆస్తుల విలువు సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చిన అభిప్రాయపడుతున్నారు. 

అనిల్‌ దేశ్‌ముఖ్ ఈడీ దర్యాప్తుకు హాజరు కాకుండా ఇప్పటికే మూడు సమన్లు తప్పించుకున్నారు. అతని కుమారుడు హృషికేశ్, భార్యకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ వారు కూడా దర్యాప్తుకు నిరాకరించారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ హోంమంత్రిగా ఉన్న సమయంలో ముంబైలోని పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్‌ ఆరోపణలు మేరకు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశ్‌ముఖ్ తన పదవీకి రాజీనామా చేశారు.

తనపై వచ్చిన ఈ ఆరోపణలను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఖండించారు. ఈడీ అన్యాయంగా అనిల్‌పై కేసు నమోదు చేసిందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ఈ క్రమంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌, ఈడీ బలవంతపు చర్యల నుంచి రక్షణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు