ఈడీ దాడులు: అప్పుడు నోట్ల కట్టలు.. ఇప్పుడేమో ఇలా.. వైరల్‌

25 Aug, 2022 11:50 IST|Sakshi

వైరల్‌: సోషల్‌ మీడియా జనాల జీవితాలకు అతుక్కుపోయింది. స్మార్ట్‌ ఫోన్లు చేతిలో ఉన్న చాలామంది ఉత్తపుణ్యానికి రీల్స్‌, వీడియోస్‌ అంటూ ఇంటర్నెట్‌ డాటాను తెగ ఖర్చు చేసేస్తున్నారు. అదే సమయంలో ఈ వాడకాన్ని పరిగణనలోకి తీసుకుని తమ తమ ప్రమోషన్ల కోసం సోషల్‌ మీడియాను వాడేస్తున్నారు. 

సినీ, పొలిటికల్‌, స్పోర్ట్స్‌ నుంచి పోలీసుల దాకా, పబ్లిక్‌.. ప్రైవేట్‌ రంగాల్లో ఇప్పుడు సోషల్‌ మీడియా ప్రమోషన్‌ సాధారణం అయిపోయింది. ఆఖరికి అవగాహన కోసం కూడా ఈ ఫ్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో.. తామేం తక్కువ తీసిపోలేదని అంటోంది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. తాజాగా బెంగాల్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌కు సంబంధించి బెంగాల్‌ మాజీ మంత్రి పార్థా చటర్జీ సన్నిహితురాలి ఇంట్లో రూ.50 కోట్లకు పైగా రికవరీ చేసి.. ఆ నోట్ల కట్టలను ఈడీ అనే అక్షరాల షేప్‌లో పేర్చి.. ఆ ఫొటోలను మీడియాకు రిలీజ్‌ చేసింది. 

అలాగే జార్ఖండ్‌లోనూ  ఐఏఎస్‌ అధికారిణి పూజా సింఘాల్‌ అనుచరులు, సీఎం హేమంత్‌ సోరెన్‌ అనుచరుడు పంకజ్‌ మిశ్రా ఇళ్లలో దాడుల అనంతరం అలాగే నోట్ల కట్లను ఈడీ అనే అక్షరాలు వచ్చేలా పేర్చింది.

తాజాగా సీఎం హేమంత్‌ సోరెన్‌ సన్నిహితుడైన ప్రేమ్‌ ప్రకాశ్‌ ఇంట్లో జరిపిన తనిఖీల్లో రెండు ఏకే-47 రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా.. రైఫిల్స్‌ను, బుల్లెట్లను ఈడీ షేప్‌లో పేర్చి.. ఆ ఫొటోలను రిలీజ్‌ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. తాము మాత్రం తమ విధులను సక్రమంగానే నిర్వహిస్తున్నామని, కావాలంటే తమ పని తీరును చూస్కోమంటూ ఇలా సోషల్‌మీడియా ద్వారా ఫొటోలను వైరల్‌ చేస్తోంది ఈడీ.

ఇదీ చదవండి: ఎక్సర్‌సైజులతో అతని సగం బుర్ర మాయం!

మరిన్ని వార్తలు