ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు..

30 May, 2023 18:55 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ మరోసారి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. కవితకు సంబంధించిన వ్యక్తిగా స్కాంలో అరుణ్‌ పిళ్లై వ్యవహరించారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో కవిత పాత్రపై సమగ్ర దర్యాప్తు వివరాలను కోర్టుకు ఈడీ సమర్పించింది. నాలుగవ సప్లమెంటరీ చార్జిషీట్‌లో 53 సార్లు కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది.

278 పేజీల భారీ చార్జిషీట్‌లో అరుణ్ పిళ్లై, బుచ్చి బాబు సమీర్ మహేంద్ర కీలక స్టేట్‌మెంట్లలో కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు  వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందే కవిత, ఆప్ విజయ్ నాయర్ మధ్య  చర్చలు జరిగాయి. ఆ తర్వాత మద్యం పాలసీ ఖరారు చేసినట్లు పేర్కొన్న ఈడీ.. కవిత కాల్ డేటా రికార్డును సాక్ష్యంగా సమర్పించింది.

‘‘ఏప్రిల్ 8, 2022న కవిత అరుణ్ పిళ్లైలు వంద కోట్ల ముడుపుల సొమ్మును తిరిగి ఎలా రాబట్టుకోవాలనే అంశంపై విజయ్ నాయర్ దినేష్ అరోరాతో ఢిల్లీలోని ఉబెరాయ్‌ హోటల్లో చర్చించారు. సౌత్ గ్రూపునకు అనుకూలమైన విధానం రూపకల్పన చేసి  ముడుపులు అందుకున్నారు. సౌత్ గ్రూప్ నుంచి విజయనాయర్ 100 కోట్ల ముడుపులు అందుకున్నారు. పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత కవిత, సమీర్ మహేంద్ర ఫేస్ టైం లో మాట్లాడుకుని బిజినెస్ బాగుందని అభినందనలు తెలుపుకున్నారు. ఇండో స్పిరిట్ ఎల్ వన్ దరఖాస్తు ఆలస్యం కావడంపై సమీర్ మహేంద్రతో కవిత చర్చలు జరిపింది’’ అని ఈడీ పేర్కొంది. బ్రిండ్ కో యజమాని అమన్ దల్ తమకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నారని సమీర్‌ వెల్లడించగా, అలాంటి సమస్యలుంటే తాను క్లియర్ చేస్తానని కవిత చెప్పినట్లు ఈడీ వెల్లడించింది.
చదవండి: లిక్కర్‌ స్కాంలో సిసోడియాకు గట్టి దెబ్బ, ఆ వెంటనే..

‘‘ఈ అంశంపై హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నారు. తన తరఫున అరుణ్ వ్యాపారంలో ఉంటారని అవసరమైతే ఈ వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని  కవిత సూచించింది. తాను కవితను రెండుసార్లు కలిశానని, ముడుపులు తిరిగి రాబట్టుకునే అంశంపై చర్చించానని విజయ్ నాయర్ స్టేట్మెంట్ ఇచ్చారు. 11.11.2022న ఈడీ ముందు అరుణ్ పిళ్ళై  కీలక సాక్ష్యం ఇచ్చారు. కవితకు ఆప్‌కు మధ్య 100 కోట్ల రూపాయల డీల్ కుదిరింది అని అరుణ్ పిళ్లై స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఇండో స్పిరిరిలో ఆమెకు వాటాలు ఉన్నాయి’’ అని ఈడీ పేర్కొంది.

కవిత తరపున తాను భాగస్వామిగా పనిచేశానని అరుణ్ పిళ్ళై వెల్లడించారని, పెర్నార్డ్ రికార్డు బిజినెస్‌ను ఇండస్పిరిట్‌కు ఇప్పించి, అందులో 65 శాతం వాటాలు పొందారని, ఈ వ్యాపారంలో కవితే అసలైన ఇన్వెస్టర్ అని, కవితకు ఆప్‌కు మధ్య సంపూర్ణమైన అవగాహన కుదిరింది’’ అని ఈడీ తెలిపింది.

మరిన్ని వార్తలు