లిక్కర్‌ స్కాం: పిళ్లై ఎందుకు స్టేట్‌మెంట్‌ మార్చుకున్నారో అర్థమవుతోంది:ఈడీ

13 Mar, 2023 15:12 IST|Sakshi
బుచ్చిబాబుతో కవిత(పాత ఫొటో), ఇన్‌సెట్‌లో పిళ్లై

సాక్షి, ఢిల్లీ:  లిక్కర్‌ స్కాంలో.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. మార్చి 15వ తేదీన తమ ముందు హాజరు కావాలని అందులో ఆదేశించింది ఈడీ. కవిత బినామీగా పేర్కొన్న అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి బుచ్చిబాబును విచారించాలని ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలో..

ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో సోమవారం ఈడీ ఇవాళ అరుణ్‌ రామచంద్ర పిళ్లైను హాజరుపర్చి.. కీలక వాదనలు వినిపించింది. తన వాంగ్మూలం ఉపసంహరించుకునేందుకు ఆయన స్పెషల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. ‘‘చాలా కీలక సమయంలో పిళ్ళై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు. పిళ్ళై విచారణకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయి. విచారణ సమయంలో పిళ్లైను ఒత్తిడి చేయలేదు, బెదిరించలేదు. టార్చర్‌ కూడా చేయలేదు’’ అని కోర్టును తెలిపింది ఈడీ. 

పిళ్లై 2022, సెప్టెంబరు 18వ తేదీన పూర్తి స్టేట్మెంట్ ఇచ్చారు. సెకండ్, థర్డ్ స్టేట్మెంట్లలో  కూడా వివరాలు మరోసారి కన్ఫర్మ్  చేశారు. ఆయనను టార్చర్ చేస్తే మిగిలిన స్టేట్మెంట్ లలో ఎలా కన్ఫర్మ్ చేస్తారు?. మార్చి తర్వాతే స్టేట్ మెంట్ మార్చుకున్నారు?. ఆయన స్టేట్ మెంట్ ఎందుకు మార్చుకున్నారో అర్థమవుతోంది. ఒక బలమైన వ్యక్తిని మేము సమ్మన్ చేసినప్పుడు పిళ్లై  తన స్టేట్మెంట్ మార్చుకున్నారు’’ అని ఈడీ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో.. సాయంత్రం 4 గంటలకు తీర్పును వాయిదా వేసింది కోర్టు.

అంతేకాదు.. బుచ్చిబాబుతో కలిపి పిళ్లైని మరోసారి విచారించాలని కోర్టుకు కోరుతూ.. మరో మూడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరుతోంది. ‘‘కస్టడీ మరో మూడు రోజులు పొడిగించండి. ఇతర నిందితులతో కలిపి విచారణ చేయాలి. మరి కొంతమందికి సమన్లు ఇవ్వాల్సి ఉంది. రామచంద్ర పిళ్లై కస్టడీ అవసరం’ అని ఈ సందర్భంగా ఈడీ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఇదిలా ఉంటే.. లిక్కర్‌ స్కాంలో కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్‌ అయిన గోరంట్ల బుచ్చిబాబును ఫిబ్రవరి 8వ తేదీన సీబీఐ అరెస్ట్‌ చేయగా..  మార్చి 6వ తేదీన బెయిల్‌ మీద బయటకు వచ్చారు.

మరిన్ని వార్తలు