జేకేసీఏ స్కామ్‌ : ఫరూక్‌ అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ

19 Oct, 2020 14:22 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (జేకేసీఏ) స్కామ్‌కు సంబంధించి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లాను ఈడీ అధికారులు శ్రీనగర్‌ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫరూక్‌ అబ్దుల్లా సహా పదిమంది జేకేసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల జారీ సంస్థగా మార్చేశారని, ఈ కుంభకోణం వెలుగుచూసిన 2005-12లో పలు బోగస్‌ ఖాతాలను నిర్వహించారని ఈడీ ఆరోపిస్తోంది. కాగా, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఫరూక్‌ అబ్దుల్లాను ప్రశ్నిస్తున్నారని ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా ఆరోపించారు.

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం ఆరు పార్టీలు కూటమిగా ఏర్పడటంతోనే కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఈడీ సమన్లపై తమ పార్టీ త్వరలో స్పందిస్తుందని చెప్పారు. అయితే ఫరూక్‌ నివాసంపై ఎలాంటి దాడులు జరగలేదని వివరించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని కోరుతూ ఫరూక్‌ అబ్ధుల్లా నివాసంలో జరిగిన ఆరు పార్టీల నేతల సమావేశం డిక్లరేషన్‌ జారీ చేసిందని చెప్పారు.  చదవండి : కశ్మీర్‌లో ప్రధాన పార్టీల కూటమి

ఈ భేటీలో పీడీపీ చీఫ్‌ మెహబూబూ ముఫ్తీ, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ సజద్‌ లోన్‌, పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ నేత జావేద్‌ మిర్‌, సీపీఎం నేత మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి, ఆవామి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ముజఫర్‌ షా పాల్గొన్నారు. మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం నుంచి విడుదలైన రెండు రోజుల అనంతరం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా ఈ సమావేశానికి పిలుపు ఇచ్చారు.

మరిన్ని వార్తలు