ED Raids: ప్లీనరీ వేళ కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై ఈడీ సోదాలు..

20 Feb, 2023 16:40 IST|Sakshi

ప్రతిపక్ష పార్టీల నేతలే టార్గెట్‌గా దేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులు పొలిటికల్‌గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బొగ్గు కుంభకోణం కేసులో కాంగ్రెస్‌ పార్టీ నేతల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు జరుగుతున్నాయి.

వివరాల ప్రకారం.. బొగ్గు కుంభ‌కోణానికి సంబంధించిన కేసులో ఈడీ సోమవారం 14 చోట్ల తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ట్రెజ‌ర‌ర్ రామ్ గోపాల్ అగ‌ర్వాల్‌కు రూ. 52 కోట్లు ముడుపులు ముట్టిన‌ట్లు డాక్యుమెంట‌రీ ఆధారాలు ఉన్నాయ‌ని ఈడీ పేర్కొన్న‌ది. ఆరి డోంగ్రి మైనింగ్‌లో జ‌రిగిన అక్ర‌మాల‌కు సంబంధించిన కేసులో కూడా ఈడీ ద‌ర్యాప్తు చేస్తోంది. ట‌న్ను బొగ్గు స‌ర‌ఫరాపై అక్ర‌మంగా రూ.25 వ‌సూల్ చేసి.. 2021లో స‌గ‌టున సుమారు 500 కోట్లు వ‌సూల్ చేసిన‌ట్లు ఈడీ ఆరోపణ చేసింది. ఈ కేసులో భాగంగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతల ఇళ్లు, ఆఫీసుల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

ఇక, ఈడీ తనిఖీలపై సీఎం భూపేష్‌ భఘేలే స్పందించారు. ఈ సందర్భంగా సీఎం భఘేల్‌ మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతం అవడాన్ని బీజేప తట్టుకోలేకపోతోంది. కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన ఆదారణ చూసి బీజేపీ భయాందోళనకు గురువుతోంది. హిండెన్‌ బర్గ్‌ నివేదికతో అదానికి చెందిన అసలు విషయాలు వల్ల బీజేపీ ఇబ్బందిపడుతోంది. వీటిని నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకే బీజేపీ.. ఈడీ దాడులు చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ దేశానికి నిజం తెలుసు.. పోరాడి గెలుస్తాం అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ ప్లీన‌ర్ రాయ్‌పూర్‌లో జరుగనుంది. ఈ నేప‌థ్యంలో ఈ దాడులు జ‌ర‌గ‌డం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. 

మరిన్ని వార్తలు