Delhi Liquor Scam: లిక్కర్‌ స్కామ్‌లో దూకుడు పెంచిన ఈడీ.. 40 ప్రాంతాల్లో సోదాలు!

16 Sep, 2022 10:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో పొలిటికల్‌ హీట్‌ ఇంకా తగ్గలేదు. లిక్కర్‌ స్కామ్‌ కేసుపై బీజేపీ నేతలు ఇంకా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు.. లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది. దీంతో తెలంగాణలో ఊహించని విధంగా పొలిటికల్‌ టెన్షన్‌ చోటుచేసుకుంది.

లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ శుక్రవారం ఉదయం మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఇక, హైదరాబాద్‌లో 25 ప్రాంతాల్లో  25 బృందాలు సోదాలు జరుపుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌లోని రాయదుర్గం, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారులు లిక్కర్‌ పాలసీ దక్కించుకున్న కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 

మరోవైపు.. లిక్కర్‌ స్కామ​్‌పై బీజేపీ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్‌ సింగ్‌ సిర్సా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ కుంభకోణం వ్యవహారంలో హైదరాబాద్‌ నుంచి ఎవరెవరు ఢిల్లీకి వచ్చారు, ఎవరెవరిని కలిశారు... ఢిల్లీ నుంచి ఎవరు హైదరాబాద్‌ వెళ్లి ఎవరెవరిని, ఎప్పుడు కలిశారు.. అనే వాటి గురించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో తాము చేసిన ఆరోపణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున వివరాలన్నీ తెలంగాణలోనే చెబుతామన్నారు. హైకోర్టు స్టే విధించిన కారణంగా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడట్లేదన్నారు.

ఇది కూడా చదవండి: సర్వే రిపోర్టులతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో గుబులు !

>
మరిన్ని వార్తలు