Coal scam: అభిషేక్‌, భార్య రుజీరాకు ఈడీ సమన్లు

28 Aug, 2021 15:25 IST|Sakshi

అభిషేక్‌ బెనర్జీ, ఆయన భార్య రుజీరాకి ఈడీ సమన్లు

కోల్‌ స్కాం, మనీ లాండరింగ్‌ ఆరోపణలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ, అభిషేక్ బెనర్జీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభిషేక్‌, ఆయన భార్య రుచిరా బెనర్జీకి సమన్లు జారీ చేసింది.  సెప్టెంబర్ 6 న అభిషేక్‌,  సెప్టెంబర్ 1 న రుజీరా  ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశించింది.

రాష్ట్రంలో జరిగిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని అభిషేక్‌ దంపతులను ఆదేశించింది. అలాగే బెనర్జీల తరఫు న్యాయవాది సంజయ్ బసు సెప్టెంబర్ 3 , వీరితోపాటు ఇదే కేసులో  బెంగాల్ పోలీసు ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు  శ్యామ్ సింగ్, జ్ఞవంత్ సింగ్‌లు సెప్టెంబర్ 8 ,9 తేదీల్లోహాజరుకావాలని ఈడీ ఆదేశించింది.  కోట్లరూపాయల అవినీతి సంబంధించి  సీబీఐ (నవంబర్, 2020) దాఖలు చేసిన కేసు అధారంగా ఈ సమన్లు జారీ చేసినట్టు ఈడీ  అధికారులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించిన మరికొంతమందిని కూడా వచ్చే నెలలో హాజరుకావాలని సమన్లు జారీ చేశామన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను ఖండించిన అభిషేక్‌ దర్యాప్తు సంస్థల ద్వారా బీజీపీ సర్కారు తమపై వేధింపులకు పాల్పడుతోందని  అభిషేక్‌ ఆరోపించారు.  రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ పరిణామమని మండిపడ్డారు.

కాగా పశ్చిమ బెంగాల్‌లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌కు(ఈసీఎల్‌) చెందిన బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకొని, స్వాహా చేశారని ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంతో రుచిరా బెనర్జీకి, మరదలు మేనకా గంభీర్‌కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. అలాగే అక్రమమైనింగ్‌ వ్యవహారంలో అభిషేక్  ప్రధాన లబ్ధిదారుని గతంలో ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు