‘అమ్మ’ ఇంట్లో 8 వేల వస్తువులు

27 Jul, 2020 07:11 IST|Sakshi

32 వేల పుస్తకాలు భద్రపరిచే పనిలో అధికారులు 

త్వరలో ట్రస్ట్‌కు అప్పగింత 

వేదనిలయానికి భద్రత పెంపు

సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేదనిలయంను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే.  ఈ ఇంటిని చెన్నై జిల్లా కలెక్టరేట్‌ పరిధి నుంచి సమాచార శాఖ పరిధిలోకి తెచ్చారు. త్వరలో ట్రస్ట్‌కు అప్పగించనున్నారు. ప్రస్తుతం సేకరించిన జాబితా మేరకు అమ్మ ఇంట్లో 8 వేల వస్తువులు ఉన్నట్టు తేలింది. దివంగత సీఎం జయలలితకు పోయెస్‌గార్డెన్‌లో వేదనిలయం ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇంటిని తన గుప్పెట్లోకి తీసుకునేందుకు పాలకులు ప్రయత్నించి ఫలితాన్ని సాధించారు. ఆ ఇంటిని అమ్మ స్మారక మందిరంగా మార్చే రీతిలో సీఎం, డిప్యూటీ సీఎంల నేతృత్వంలో ట్రస్ట్‌ ఏర్పాటైంది.

న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా ప్రత్యే క చట్టాన్ని సైతం తీసుకొచ్చారు. అలాగే, అమ్మ కుటుంబవారసులుగా ఉన్న దీప, దీపక్‌ల నుంచి భవిష్యత్తులో చిక్కులు ఎదురుకాని రీతిలో ఆ ఇంటిని కొనుగోలు చేస్తూ, అందుకు తగ్గ నగదు బ్యాంక్‌లో డిపాజిట్‌ చేశారు. అయితే, దీనిని దీప తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరో న్యాయ పోరాటం అన్న ప్రకటన చేశారు. ఈ పరిస్థితుల్లో అమ్మ ఇంటిని ప్రస్తుతం చెన్నై జిల్లా కలెక్టరేట్‌ పరిధి నుంచి సమాచార శాఖ పరిధిలోకి తీసుకొ చ్చి ఉండడం మనార్హం. త్వరలో ఆ ట్రస్ట్‌కు ఈ ఇంటిని అప్ప గించబోతున్నారు. కలెక్టరేట్‌ నుంచి  సమాచార శాఖకు వచ్చిన సమాచారాల మేరకు ఆ ఇంట్లో ఉన్న వస్తువుల చిట్టా వెలుగు చూసింది. 

భారీ గానే వస్తువులు.... 
అమ్మ ఇంట్లో 32 వేల 700 పుస్తకాలు ఉన్నట్టు లెక్కించారు. అలాగే, 8,376 వస్తువులు ఉండడం గమనార్హం. ఇందులో 14 కేజీలుగా పేర్కొంటున్న 437 బంగారు ఆభరణాలు, 601.4 కేజీలుగా పేర్కొంటున్న 867 వెండి వస్తువులు ఉన్నాయి. అలాగే, ఆరు వేల పాత్రలు, 556 ఫర్నీచర్లు, 162 చిన్న చిన్న వెండి వస్తువులు,108 అలంకరణ వస్తువులు, 29 ఫోన్లు, సెల్‌ఫోన్లు, 15 పూజా సామగ్రి, పది ఫ్రిడ్జ్‌లు, 38 ఎసీలు, 11 టీవీలు, ఆరు గడియారాలు ఉన్నట్టుగా లెక్క తేల్చారు. అలాగే, 10,438 వివిధ  వస్త్రాలు ఉన్నట్టు తేల్చారు. వీటన్నింటిని ట్రస్ట్‌కు మరి కొద్ది రోజుల్లో అప్పగించబోతున్నారు. ఈ వస్తువుల్లో కొన్నింటిని అమ్మ స్మారక మందిరంలో ప్రజల సందర్శన కోసం ఉంచే అవకాశాలు ఎక్కువేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, వేద నిలయంను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవడంతో ఆ పరిసరాల్లో భద్రతను పెంచారు. ఆ ఇంటి వైపుగా అధికారులు తప్ప, మరెవ్వరూ వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.  

మరిన్ని వార్తలు