Eknath Shinde: పొలిటికల్‌ హీట్‌ పెంచిన షిండే ట్వీట్‌.. ఉద్ధవ్‌ థాక్రేతో స్నేహం!

27 Jul, 2022 11:52 IST|Sakshi

మహారాష్ట్రలో ట్విస్టు మీద ట్విస్టులు చోటుచేసుకుంటూ శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే.. బీజేపీతో పొత్తుపెట్టుకుని సర్కార్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే వర్గం, రెబల్‌ శివసేన షిండే వర్గం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. 

అనంతరం.. ఉహించని ఘటన చోటుచేసుకుంది. నమ్మకద్రోహి అంటూ పరోక్షంగా షిండేపైనే ఉద్దవ్‌ థాక్రే విమర్శలు గుప్పించిన వేళ.. బుధవారం ఆసక్తికర పరిణామం జరిగింది. నేడు(బుధవారం) ఉద్ధవ్‌ థాక్రే పుట్టినరోజు సందర్భంగా ఏక్‌నాథ్‌ షిండే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏక్‌నాథ్‌ షిండే ట్విట్టర్‌ వేదికగా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులైన శ్రీ ఉద్ధవ్‌ థాక్రే జీకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆయురారోగ్యాలతో  ఉండాలని అమ్మ జగదాంబ పాదాలను ప్రార్థిస్తూ.. అంటూ ఓ పోస్టు పెట్టారు. దీంతో, ఏక్‌నాథ్‌ షిండే వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఇదిలా ఉండగా.. అంతుకు ముందు ఉద్ధవ్‌ థాక్రే రెబల్‌ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. థాక్రే మీడియాతో మాట్లాడుతూ.. రెబల్స్‌ నన్ను మోసం చేశారు. పార్టీని చీల్చారు. శివ సేన గౌరవ వ్యవస్థాపకులు  బాల్‌థాక్రే ఫొటోను ఓట్ల రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారు. దమ్ముంటే.. అలా అడుక్కోవడం ఆపండి. మీ మీ సొంత తండ్రుల ఫొటోలను వాడి ఓట్లు సంపాదించుకోండి అంటూ చురకలంటించారు. 

ఇది కూడా చదవండి: నమ్మకద్రోహి.. దమ్ముంటే ఆ పని చెయ్యి: షిండేకు థాక్రే చురకలు

మరిన్ని వార్తలు