ఫ్రీ బస్సులోనూ టికెట్‌ కోసం పట్టు.. బామ్మ వీడియో వైరల్‌

29 Sep, 2022 20:07 IST|Sakshi

చెన్నై: ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణమంటే ఎవరు కాదంటారు? ఎగిరి గంతేసి ఫ్రీగా చక్కర్లు కొడుతుంటారు. కానీ, కొందరు అలా ఉండరు. టికెట్‌ కొనుక్కునే వెళ్తుంటారు. అలాంటి కోవకే చెందుతారు ఈ వృద్ధురాలు. బస్సులో ఉచితంగా ప్రయాణించనని, తనకు టికెట్‌ ఇవ్వాలని కండక్టర్‌తో గొడవ పడుతున్న బామ్మ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగింది. 

రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికార డీఎంకే పార్టీ.. రాష్ట్రంలోని మహిళలు ప్రభుత్వ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించింది. మధుకరాయ్‌ నుంచి పాలథురాయ్‌ వెళ్తున్న ఓ బస్సులో వృద్ధురాలు ఎక్కింది. బస్సులో పురుషుల వద్ద టికెట్లు తీసుకుంటున్నాడు కండక్టర్‌. తనకూ టికెట్‌ ఇవ్వాలని కండక్టర్‌ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వబోయింది వృద్ధురాలు. ముందుగా అందుకు నిరాకరించిన కండక్టర్‌..  డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఉచితంగానే వెళ్లొచ్చని ఆమెకు వివరించే ప్రయత్నం చేశాడు. అయితే.. తాను ఫ్రీగా వెళ్లాలనుకోవట్లేదని, టికెట్‌ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దీంతో చేసేదేమీ లేక టికెట్‌కు సరిపడ రూ.15 తీసుకుని టికెట్‌ ఇచ్చాడు.

ఇదీ చదవండి: చైనీయులకు 2 రోజుల్లో అమెరికా వీసా.. భారతీయులకు రెండేళ్లు!

>
మరిన్ని వార్తలు