అయ్యబాబోయ్‌ ఏనుగులు.. పరుగో పరుగు!

27 Jun, 2022 19:59 IST|Sakshi

హైవేపై వాహనాలకు అడ్డుపడ్డ ఏనుగులు

ముందుకు కదిలిన కారుపై మూక దాడి

చామరాజనగర జిల్లా సరిహద్దులో ఘటన 

యశవంతపుర: రహదారిపై ఏనుగుల మంద తిష్ట వేసి, వాహనాలను ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా సరిహద్దులో జరిగింది. హాసనూరు వద్ద తమిళనాడు దిండిగల్‌ హైవే–209లో ఆదివారం ఉదయం ఏనుగుల మంద చొరబడింది. ఇది మా అడ్డా, మీకేం పని అన్నట్లు రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అడ్డుపడి ఆపేశాయి. వాహనాలలోని ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. 

ఒక కారు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించగా ఏనుగులు కారుపై కాళ్లు పెట్టి మరీ అడ్డుకున్నాయి. వెనుక కార్లలో ఉన్నవారు ఏనుగుల రుబాబును వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. ఈ మార్గంలో అప్పుడప్పుడు ఏనుగులు చొరబడి వాహనాలపై దాడులు చేస్తుంటాయి.


తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం

తిరుమల: తిరుమల మొదటిఘాట్‌ రోడ్డులో ఆదివారం ఏనుగుల గుంపు మరోమారు కలకలం సృష్టించాయి. మొదటిఘాట్‌ రోడ్డులోని ఎలిఫెంట్‌ ఆర్క్‌ సమీపంలో పది ఏనుగుల గుంపు రోడ్డుకు సమీపంలోని అటవీప్రాంతంలో చెట్లను విరుస్తూ శబ్దాలు చేశాయి. దీంతో ఘాట్‌ రోడ్డులో ప్రయాణిస్తోన్న వాహనచోదకులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న టీటీడీ అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి తరిమారు. ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచారించడం ఇది రెండోసారి. (క్లిక్‌: రోడ్డు రోలర్‌తో తొక్కించి సైలెన్సర్ల ధ్వంసం)

మరిన్ని వార్తలు