దూకుడు పెంచిన ఈడీ.. బిహార్‌ డిప్యూటి సీఎంకు షాక్‌!

10 Mar, 2023 13:59 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచుతోంది. ఇప్ప‌టికే కేసులు, స్కాంలో చిక్కుకున్న పలు నేతల ఇళ్లలో సోదాలు, విచారణలో చేపడుతున్న ఈడీ తాజాగా బిహార్‌ డిప్యూటీ సీఎంగా తేజ‌స్వి యాద‌వ్ నివాసంలో సోదాలు చేప‌ట్టింది. ల్యాండ్ ఫ‌ర్ జాబ్స్ స్కామ్‌లో ఈడీ త‌నిఖీలు జ‌రుపుతోంది. దేశ రాజధానిలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న ఆర్జేడీ నాయకుడి నివాసంతో పాటు ముంబై, యూపీ, బిహార్‌లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.

ఆయా కేసుల‌కు సంబంధించి సాక్ష్యాల‌ను సేక‌రణ కోసం మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ రంగంలోకి దిగింద‌ని సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని సమాజ్‌వాదీ పార్టీ నేత జితేంద్ర యాదవ్‌ నివాసానికి కూడా ఈడీ అధికారులు చేరుకున్నారు. జితేంద్ర యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రాగిణి భర్త.  బీహార్‌లోని పాట్నాలో ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ సహాయకుడు అబు దోజానా ఇంట్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. కాగా కొన్ని రోజుల క్రిత‌మే ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న బీహార్ మాజీ సీఎం ర‌బ్రీదేవి నివాసంలో సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

మరిన్ని వార్తలు