వెరైటీ దొంగలు.. బస్ ‌స్టాప్‌ని దొంగతనం చేశారు

22 Oct, 2020 08:29 IST|Sakshi

ముంబై: కార్లు, బైక్‌లు ఎత్తుకెళ్లే వారి గురించి విన్నాం.. చూశాం. చివరకు బస్సు దొంగతనం చేసే వారి గురించి విన్నాం.. చూశాం. కానీ ఏకంగా బస్‌ స్టాప్‌ని దొంగిలించిన వారిని చూడటం కాదు కదా కనీసం విని కూడా ఉండం కదా. కానీ వాస్తవం.. ఈ సంఘటన పూణెలో చోటు చేసుకుంది. ఎవరో దుండగులు లోకల్‌ బస్‌ స్టాప్‌ని దొంగతనం చేశారు. దాంతో వీరిని పట్టించిన వారికి ఐదు వేల రూపాయల బహుమతి ఇస్తామంటూ లోకల్‌ లీడర్లు ఓ ప్రకటన కూడా ఇచ్చారు. రెడిట్‌ యూజర్‌ ఒకరు దీని గురించి షేర్‌ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ‘పూణె మహానగర్‌ పరివహన్‌ ప్రజల కోసం దేవాకి ప్యాలెస్‌ ముందు బిటి కవాడే వద్ద ఏర్పాటు చేసిన బస్‌ స్టాప్‌ దొంగతానానికి గురయ్యింది. నిందితుల గురించి సమాచారం ఇచ్చిన వారికి 5వేల రూపాయల బహుమతి ఇస్తాం’ అంటూ మాజీ ఎన్‌సీపీ కార్పొరేటర్‌ ప్రశాంత్‌ మాస్కే ఏర్పాటు చేసిన బ్యానర్‌ ఫోటోని షేర్‌ చేశాడు. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (చదవండి: ఆటోడ్రైవర్ల ఫోన్లు మాత్రమే దొంగిలిస్తాడు!)

దీని పట్ల రెడిట్‌ యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎవరో కావాలనే ఇలా చేసి ఉంటారు.. అసలు అక్కడ బస్‌ స్టాప్‌ లేనే లేదు.. ముక్కలుగా చేసి పాత ఇనుప సామానుల వాడికి అమ్మేసుకున్నారేమో అంటూ కామెంట్‌ చేస్తున్నారు. దీని గురించి రెడిట్‌లో పోస్ట్‌ చేసిన వ్యక్తి ‘ఈ సంఘటన గురించి ఇద్దరు వీధి వ్యాపారులను అడిగాను. పగటిపూట ఇలాంటి సంఘటన జరగలేదని వారు చెప్పారు. అయితే బస్‌ స్టాప్‌ని ఎవరు దొంగతనం చేశారో తెలియదు. కానీ అంతకుముందు ఇక్కడ బస్‌ స్టాప్‌ ఉన్న మాట వాస్తవం.. ప్రస్తుతం అది దొంగతనానికి గురయిన మాట నిజం’ అంటూ ఫోటో పోస్ట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు