ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్

31 May, 2021 17:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఈ కరోనా మహమ్మరి కాలంలో ఒక తీపికబురు అందించింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈపీఎఫ్ఓ చందాదారులు తమ ఖాతా నుంచి అడ్వాన్స్‌ తీసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇలాంటి విపత్కర మహమ్మారి సమయంలో చందాదారుల ఆర్ధికంగా అండగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. కొత్త నిబంధనల ప్రకారం, ఉద్యోగులు మూడు నెలల పాటు బేసిక్ శాలరీ, డీఏ జీతాన్ని లేదా భవిష్యనిధిలోని 75శాతం డబ్బును(ఏదీ తక్కువైతే అది) అడ్వాన్స్‌గా తీసుకునేందుకు వీలు కల్పించింది. 

గతంలో ఈ అవకాశాన్ని వినియోగించుకున్నవారు కూడా రెండోసారి అడ్వాన్స్‌ తీసుకోవచ్చని ప్రకటించింది. "ఈ మహమ్మారి సమయంలో కోవిడ్ -19 అడ్వాన్స్ ఈపీఎఫ్ సభ్యులకు గొప్ప సహాయంగా ఉంటుంది. ముఖ్యంగా నెలవారీ వేతనాలు రూ.15,000 కన్నా తక్కువ ఉన్నవారికి" అని కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ 7.6 మిలియన్లకు పైగా కోవిడ్ అడ్వాన్స్ క్లెయిమ్‌లను పరిష్కరించి మొత్తం రూ.18,698.15 కోట్లు పంపిణీ చేసింది. అంతేగాక, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొవిడ్‌ అడ్వాన్స్‌ క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో మూడు రోజుల్లోనే పరిష్కరిస్తోందని వెల్లడించింది.

చదవండి: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆధార్ లింక్ చేయండి?

మరిన్ని వార్తలు