ఈపీఎఫ్ఓ : వాట్సాప్ హెల్ప్‌లైన్ 

14 Oct, 2020 19:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకోసం కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. పీఎఫ్ చందారుల సౌలభ్యం కోసం  కొత్తగా  వాట్సాప్ హెల్ప్‌లైన్ సేవను ప్రారంభించింది. దీని ద్వారా ఫిర్యాదులు, సందేహాల నివృత్తి చేసుకోవచ్చని ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 24x7 టోల్ ఫ్రీ నంబర్, పోర్టల్ , ఫేస్ బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు అదనంగా దీన్ని అందుబాటులో తీసుకొచ్చింది.

దేశంలోని 138 ప్రాంతీయ కార్యాలయాలలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. సంబంధిత ప్రాంతీయ కార్యాలయ హెల్ప్‌లైన్ నంబర్‌ ద్వారా పీఎఫ్ అందించే సేవలకు సంబంధించిన సందేహాలు తీర్చుకోవడంతొపాటు, ఫిర్యాదులను దాఖలు చేయవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా సత్వర, సురక్షితమైన సేవలు లభిస్తాయని  ప్రకటించింది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా 1,64,040 కు పైగా ఫిర్యాదులను, ప్రశ్నలను పరిష్కరించామని తెలిపింది. ఈ కొత్త సౌలభ్యం ద్వారా ఖాతాదారులు కార్యాలయాలను భౌతికంగా సందర్శించాల్సిన అవసరాన్ని బాగా తగ్గిస్తుందని పేర్కొంది. అలాగే వాట్సాప్‌లో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి, ప్రతి ప్రాంతీయ కార్యాలయంలో ప్రత్యేక నిపుణుల బృందం అందుబాటులో ఉంటుందని కార్మికశాఖ తెలిపింది. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ పోర్టల్  ద్వారా ప్రాంతీయ కార్యాలయాల వారీగా వాట్సాప్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు