కమల్‌నాథ్‌ కజిన్‌ దారుణ హత్య!

6 Feb, 2021 19:56 IST|Sakshi

మృతులు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కమల్‌నాథ్‌ కుటుంబీకులు

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఘటన

నొయిడా: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బంధువులు దారుణ హత్యకు గురయ్యారు. కమల్‌నాథ్‌కు త‌మ్ముడు వరుసయ్యే నరేంద్రనాథ్ (70), ఆయన భార్య సుమన్ (65) తమ నివాసంలోనే విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. అయితే ఈ హత్యలు తెలిసిన వారే చేసి ఉంటారని అనుమానం వ్యక్తమవుతోంది. గ్రేటర్‌ నొయిడాలో నరేంద్రనాథ్, భార్య సుమన్‌ కుటుంబసభ్యులతో నివసిస్తుంటారు. న‌రేంద్ర‌నాథ్ ఢిల్లీలో స్పేర్ పార్ట్స్ వ్యాపారం చేస్తుండగా, ఆయ‌న భార్య ఓ స్వ‌చ్చంధ సంస్థ‌లో యోగా అభ్యాస‌కురాలిగా ప‌నిచేస్తుండేది.

వ్యాపారంతోపాటు నరేంద్రనాథ్ వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు. శుక్రవారం తెల్లవారుజామున సిబ్బంది వచ్చిచూసేసరికి నరేంద్రనాథ్‌ ఇంటి సెల్లార్‌లోని బట్టల కుప్పలో విగతజీవిగా పడి ఉండగా, ఆయ‌న భార్య‌ సుమన్ మొదటి అంతస్తులోని హాల్‌లో రక్తపు మడుగులో ఉంది. వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేపట్టారు. అయితే నరేంద్రనాథ్ నుంచి పరిచయస్తులు, చుట్టుపక్కల వాళ్లు రుణాలు తీసుకునేవారని తెలిసింది.

అతను త‌న‌ ఇంటి సెల్లార్‌లో చిరు వ్యాపారులు, కూలీలతో క‌లిసి తరచూ పార్టీ చేసుకుంటుంటారు. హత్య జరిగిన రాత్రి కూడా పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో గ్లాసులు, మద్యం సీసాలు, నూడుల్స్, సిగరెట్లు ఉన్నాయి. అయితే నరేంద్రనాథ్‌ను నోట్లో గుడ్డ‌లు కుక్కి గొంతు నులిమి దారుణంగా హ‌త్య‌ చేయగా.. ఆయ‌న భార్య‌ సుమన్‌పై కాల్పులు జరిపారు. దీంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.పార్టీకి వచ్చిన వారే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల జాడ తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు