బాణసంచా గోదాంలో భారీ పేలుడు.. నలుగురు మృతి

20 Oct, 2022 15:15 IST|Sakshi

భోపాల్‌: బాణసంచా నిలువ చేసిన గోదాంలో భారీ పేలుడు సంభవించి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లా బన్మోర్‌ నగర్‌లో గురువారం జరిగింది. భారీ పేలుడుతో ఫైర్‌క్రాకర్స్‌ నిలువ చేసిన గోదాం తునాతునకలైంది. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడులో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.

‘గోదాంలోని గన్‌పౌడర్‌ వల్ల పేలుడు జరిగిందా లేదా గ్యాస్‌ సిలిండర్‌ పేలటం వల్లనా అనే అంశంపై దర్యాప్తు చేపట్టాం. ఈ పేలుడులో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. వారికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.’ అని మొరేనా కలెక్టర్‌ బక్కి కార్తికేయన్‌ తెలిపారు. గోదాం శిథిలాలను తొలగించేందుకు సహాయక బృందాలను మోహరించామని, పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఐజీ రాజేశ్‌ చావ్లా తెలిపారు. మూడేళ్ల క్రితం పంజాబ్‌లో ఇలాంటి సంఘటనే జరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇదీ చదవండి:  దీపావళి సెలవుపై ప్రభుత్వం కీలక ప్రకటన.. పబ్లిక్‌ హాలీడే ఎప్పుడంటే..

మరిన్ని వార్తలు