బంపర్‌ ఆఫర్‌: మొక్కలు నాటితే ఎక్స్‌ట్రా మార్కులు..

21 Jun, 2021 13:23 IST|Sakshi
హరియాణ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌

ప్రకటించిన హరియాణ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌

చండీగఢ్‌: చదువులో భాగంగా మొక్కలు నాటిన విద్యార్థులకు ఎక్స్‌ట్రా మార్కులు ఇవ్వనున్నట్లు హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తెలిపారు. 8-12 తరగతుల విద్యార్థులకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన చేశారు. పంచకుల జిల్లాలోని నేచర్ క్యాంప్ తప్లి అండ్‌ నేచర్‌ ట్రయల్స్‌ ఆఫ్‌ మోర్నిహిల్స్‌ ప్రాంతంలో పంచకర్మ వెల్నెస్ సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. 

ఈ సందర్భంగా మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మాట్లాడుతూ.. ‘‘పర్యావరణ పరిరక్షణలో చెట్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో విద్యార్థులను ప్రకృతితో కలిపేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. రాష్ట్రపరిధిలోని పాఠశాలలకు ఈ నియమం వర్తిస్తుంది. 8-12వ తరగతి విద్యార్థులు తమ పాఠశాల పరిధిలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలి. దీని ప్రకారం ఆఖరి పరీక్షలో వారికి మార్కులు కేటాయిస్తాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తాం’’ అని తెలిపారు.

చదవండి: ఆమె అడవిగా విస్తరించింది

మరిన్ని వార్తలు