పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన ఎఫ్‌బీ ఇండియా చీఫ్‌

2 Sep, 2020 19:36 IST|Sakshi

సోషల్‌మీడియా దిగ్గజం తీరుపై ఆందోళన

సాక్షి, న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా వేదికపై కొన్ని సిద్ధాంతాలు, భావజాలం పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ఇండియా చీఫ్‌ అజిత్‌ మోహన్‌ బుధవారం పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. భావప్రకటన స్వేచ్ఛను సోషల్‌మీడియా దిగ్గజం హరిస్తోందనే విమర్శల మధ్య సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ నేతృత్వంలోని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఎదుట అజిత్‌ మోహన్‌ హాజరయ్యారు. పౌరుల హక్కుల పరిరక్షణ, ఆన్‌లైన్‌..సోషల్‌మీడియా వేదికల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడం, డిజిటల్‌ వేదికపై మహిళల భద్రత వంటి విషయాలపై చర్చకు ఎఫ్‌బీ అధికారిని సమావేశానికి పిలిచినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, ఫేస్‌బుక్‌ ఇండియాలో సీనియర్‌ సిబ్బంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర కేబినెట్‌ మంత్రులను దూషించారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు లేఖ రాసిన మరుసటి రోజు ఎఫ్‌బీ అధికారి పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఫేస్‌బుక్‌ వేదికపై బీజేపీ నేతలను విద్వేష ప్రసంగాలు, సందేశాలు పోస్ట్‌ చేసేందుకు సోషల్‌మీడియా దిగ్గజం అనుమతించిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంతో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. వాల్‌స్ట్రీట్‌ కథనంతో ఫేస్‌బుక్‌ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. చదవండి : ఫేస్‌బుక్‌కు తృణమూల్‌ కాంగ్రెస్‌ లేఖ

మరిన్ని వార్తలు