18 మిలియన్ల పోస్టులను తొలగించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్

21 May, 2021 16:24 IST|Sakshi

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్ సంబంధిత తప్పుడు సమాచారాన్ని, అలాగే తమ నిబందనలు ఉల్లంఘించిన ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్ల కంటెంట్‌/పోస్టులను తొలగించినట్లు సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లు తన కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ తాజా ఎడిషన్‌లో తెలిపింది. విద్వేషపూరిత ప్రసంగం, బెదిరింపు, వేధింపులు, నగ్నత్వం, లైంగిక వంటి కార్యకలాపాలతో సహా ఇతర 12 ఫేస్‌బుక్ విధానాలను, 10 ఇన్‌స్టాగ్రామ్ విధానాలను ఉల్లంఘిస్తే సీఎస్‌ఇఆర్ చర్యలు తీసుకుటుంది.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి నుంచి మార్చి మధ్య 9.8 మిలియన్ ద్వేషపూరిత కంటెంట్లను ఫేస్‌బుక్ తొలగించింది. అంతకుముందు త్రైమాసికంలో ఈ సంఖ్య 6.4 మిలియన్లు. ఇక ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 3,24,500 కంటెంట్ పై చర్య తీసుకున్నారు. అదనంగా, ఫేస్‌బుక్ తన ప్రధాన సైట్లో బెదిరింపు, వేధింపులకు సంబందించిన 8.8 మిలియన్ కంటెంట్, ఇన్‌స్టాగ్రామ్‌లో 5.5 మిలియన్ల పోస్ట్‌లపై చర్యలు తీసుకుంది. ఫేస్‌బుక్ ఈ నివేదికను వివరిస్తూ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో నిబందనలకు విరుద్దమైన సమాచారాన్ని తొలగించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏ విధంగా సహాయపడిందని పేర్కొంది. 

ఇక మన దేశ విషయానికి వస్తే 2020 జూలై నుంచి డిసెంబర్ మధ్య కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఫేస్‌బుక్ భారతదేశంలో 878 విభాగాలకు సంబందించిన కంటెంట్‌ను యాక్సెస్ చేయడాన్ని పరిమితం చేసినట్లు సోషల్ మీడియా దిగ్గజం తాజా రిపోర్ట్ లో వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సెక్షన్ 69ఎను ఉల్లంఘించినందుకు ఆంక్షలు విధించినట్లు ఫేస్‌బుక్ పేర్కొంది.  ప్రభుత్వం 2020 మొదటి ఆరు నెలల కాలంలో 681 అభ్యర్థనలతో పోలిస్తే చివరి ఆరు నెలల కాలంలో అభ్యర్థనల రేటు 28.9 శాతం పెరగింది అని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా, వినియోగదారుల డేటా కోసం ప్రభుత్వ అభ్యర్థనలు 2020 ద్వితీయార్ధంలో 1,73,592 నుండి 1,91,013కు అంటే 10 శాతం పెరిగాయి. జూలై - డిసెంబర్ మధ్య కాలంలో భారతదేశం వినియోగదారు డేటా కోసం 40,300 అభ్యర్ధనలను చేసింది. యునైటెడ్ స్టేట్స్ (61,262) తర్వాత భారత్ ఎక్కువ అభ్యర్థనలు చేసింది. 2020 మొదటి అర్ధభాగంలో భారత్ 35,560 అభ్యర్థనలు చేసింది. సోషల్ మీడియా సంస్థ 52 శాతం భారత అభ్యర్థనలను పరిష్కరించింది.

చదవండి:

డ్రైవర్ అవసరం లేని డైమ్లర్స్ భారీ ట్రక్

>
మరిన్ని వార్తలు