సుధా మూర్తి కూరగాయలు అమ్మారా.. నిజమెంత?

13 Sep, 2020 16:01 IST|Sakshi

బెంగళూరు : ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అర్థాంగి.. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సుధా మూర్తి సమాజానికి మంచి చేస్తూ ఆదర్శప్రాయురాలుగా ఎంతో పేరు సంపాదించారు. ఎన్నో అనాథ ఆశ్రమాలు నెలకొల్పి ఎంతోమంది అనాథ విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. స్వతహాగా మంచి రచయిత అయిన సుధా మూర్తి ఎన్నో మంచి నవలల కూడా రచించారు. (చదవండి : పుట్టిన రోజున పిల్లలకు కానుక)

అలాంటి సుధా మూర్తి బెంగళూరు జయానగర్‌లోని రాఘవేంద్ర స్వామి మఠం వద్ద కూరగాయలు అమ్మారంటూ సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ' ఫోటోలో కనిపించేది ముమ్మాటికి సుధా మూర్తియే. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న నారాయణమూర్తి భార్య సుధా మూర్తి ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాల్లో గడుపుతారు. ప్రతి ఏడాదిలో ఒకరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీనివాసుడికి దండలు తయారు చేయడం.. మరో మూడు రోజులు రాఘవేంద్రస్వామి ఆలయం వద్ద కూరగాయలను అమ్మడంతో పాటు భక్తులకు అందించే ప్రసాదానికి తనవంతుగా కూరగాయలు కట్‌ చేస్తుంది. వ్యాపారంలో తమకు వస్తున్న సంపద కారణంగా అహంకారం అనేది రాకూడదనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆమెకు ఇవే మా వందనాలు' అంటూ కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు చూసిన కొన్ని ప్రచురణ సంస్థలు సుధా మూర్తి గురించి తప్పుడు కథనాలు ప్రచురించాయి. (చదవండి : డబ్బుతో పాటు కాన్ఫిడెన్సూ ఇచ్చిన మినిస్టర్‌)

కల్పితం : సుధా మూర్తి రాఘవేంద్ర స్వామి గుడి బయట కూరగాయలు అమ్ముతున్న ఫోటోలను చాలా సంస్థలు తమ కథనాల్లో తప్పుగా ప్రచురించాయి. సుధా మూర్తి కూరగాయలు అమ్మడం లేదని.. గుడి బయట సేవా కార్యక్రమాల పేరిట ఒక స్టోర్‌ నడుపుతున్నారని.. ఇలా తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ది చేసుకుంటున్నారని ఆరోపించాయి. కొన్ని సంవత్సరాలుగా స్టోర్‌ వద్దకు వచ్చి కూరగాయలతో పాటు ఇతర రకాల సేవలు కూడా అందిస్తున్నారు.

వాస్తవం : వాస్తవానికి సుధా మూర్తి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. స్వచ్చంద సేవ పేరుతో కొన్ని సంవత్సరాల నుంచి రాఘవేంద్ర స్వామి గుడికి వస్తున్న ఆమె భక్తులకు భోజనం సిద్ధం చేయడం, పండ్లు కడగడం, ప్రసాదానికి కూరగాయలు కోయడం వంటి కార్యక్రమాలతో సుధా మూర్తి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ సందర్భంలోనే ఆమె కూరగాయల ముందు కూర్చొని ఫోటోకు ఫోజిచ్చారు. అయితే ఆమె రాఘవేంద్ర స్వామి మఠంలో మూడు రోజులు మాత్రం తమ అనుమతితో స్టోర్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. 


కాగా అంతకుముందు బెంగళూరు మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సుధా మూర్తి తన అనుభవాన్ని పంచుకున్నప్పుడు తన సేవా కార్యక్రమాల్ని స్వయంగా వెల్లడించారు. 'ప్రతి ఏడాదిలో మూడు రోజులు దేవుడికి స్వచ్చంద సేవ చేయాలని అనుకున్నా. ఉదయం నాలుగు గంటలకే లేచి.. బెంగళూరులోని రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్లి ఏ ప్రతిఫలం ఆశించకుండా స్వచ్చంద సేవ చేస్తుంటా. సెక్యూరిటీ గార్డు సాయంతో వంటగదితో పాటు అక్కడున్న పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుంది. అనంతరం భక్తులకు అందించే ప్రసాదాల కోసం నా వంతు సాయం అందిస్తా. తర్వాత కూరగాయల నుంచి వచ్చిన వ్యర్థాలను చెత్త డబ్బాలో వేసి స్వయంగా తీసుకెళ్లి పడేసి వస్తా. ఇదంతా స్వచ్చంద సేవ మాత్రమే.. ఏ ప్రతిఫలం ఆశించను. 'అంటూ ఆమె తెలిపారు. 

మరిన్ని వార్తలు