Rajinikanth University: సోషల్‌ మీడియాలో ఫొటో వైరల్‌.. ఫ్యాన్స్‌ గుర్రు!

2 Aug, 2021 10:08 IST|Sakshi

వెండితెరపై తన స్టైలిష్‌ ఆటిట్యూడ్‌తో సౌత్‌లోనే కాదు యావత్‌ ప్రపంచంలో క్రేజ్‌ సంపాదించుకున్నారు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌. అలాంటి వ్యక్తికి ఓ అరుదైన గౌరవం దక్కింది. రజినీకాంత్‌ పేరు మీద మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్‌లో వైరల్‌ కాగా,  అశేష అభిమానగణం మురిసిపోయింది. అయితే.. ఈ వ్యవహారం ఉత్త పాత ముచ్చటేనని కాసేపటికే ఫ్యాక్ట్‌ చెక్‌లో వెల్లడైంది.  

సోషల్‌ మీడియాలో ఎక్కడో వైరల్‌ అవుతున్న ఒక ఫొటోను.. ప్రముఖ ఎంట్రెప్రెన్యూర్‌ కిరణ్‌ మజుందర్‌ షా ఆగష్టు 1న తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. రజినీకాంత్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఫర్‌ కామర్స్‌(అన్నీ స్పెల్లింగ్‌ మిస్టేక్సే) అండ్‌ ఆర్ట్స్‌ పేరిట ఈ కాలేజ్‌ బోర్డు ఉంది. దీంతో ఆమె సూపర్‌ స్టార్‌కు అరుదైన గౌరవం దక్కిందంటూ హర్షం వ్యక్తం చేసింది. అయితే కాసేపటికే అందులో ఉన్న పొరపాట్లను ఆమె గమనించి ట్వీట్‌ను డిలీజ్‌ చేసింది. అప్పటికే అది నిజమనుకుని చాలామంది ఆ ఫొటోను షేర్‌ చేశారు. ఇంకొంత మంది సెటైర్లు వేశారు. దీంతో తలైవా ఫ్యాన్స్‌ గుర్రుగా ఉన్నారు.
   

ఫ్యాక్ట్‌ చెక్‌.. నిజానికి అది సెటైరిక్‌గా రూపొందించిన ఒక మీమ్‌. పైగా ఎప్పుడో పదేళ్ల క్రితం పుట్టుకొచ్చింది. చాలా సార్లు వైరల్‌ అయ్యింది కూడా. ఇప్పుడు రజినీపై రెగ్యులర్‌గా వచ్చే మీమ్స్‌లో భాగంగా వచ్చిందా? లేదంటే యాంటీ ఫ్యాన్‌ కావాలని ఇప్పుడు పనిగట్టుకుని చేసిన పనేనా? అనేది తెలియాల్సి ఉంది. ఇంకోవైపు తలైవా ఫ్యాన్స్‌ ఎవరూ ఆ ఫొటోను షేర్‌ చేయొద్దని రజినీ ఫ్యాన్స్‌ అసోషియేషన్‌  ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేస్తోంది. ఇక ఆ ఒరిజినల్‌ ఫొటో మాత్రం.. భువనేశ్వర్‌లోని క్సేవియర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ భువనేశ్వర్‌ యూనివర్సిటీది.

మరిన్ని వార్తలు