రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేదెన్నడు?

25 Mar, 2022 05:14 IST|Sakshi

పార్లమెంటరీ స్థాయీ సంఘం

న్యూఢిల్లీ: రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరడం లేదని వ్యవసాయం, పశుసంవర్థక, ఆహార శుద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం తేల్చిచెప్పింది. 2015–16 నుంచి 2018–19 మధ్యకాలంలో జార్ఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో రైతుల ఆదాయం పడిపోయిందని వెల్లడించింది. ఈ మేరకు స్థాయీ సంఘం తన నివేదికను గురువారం పార్లమెంట్‌కు అందజేసింది.

ఇందుకు గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, రైతుల ఆదాయం పెంచే చర్యలు చేపట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖకు సూచించింది. చాలా రాష్ట్రాల్లో రైతాంగం ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న కేంద్ర వ్యవసాయ శాఖ చోద్యం చూస్తుండడం శోచనీయమని తప్పుపట్టింది. బడ్జెట్‌లో కేటాయించిన నిధులను వ్యవసాయ శాఖ పూర్తిగా ఖర్చు చేయలేకపోతోందని ఆక్షేపించింది. దేశంలో ఆరు ‘ఎయిమ్స్‌’ల్లో తగినంత మంది సిబ్బంది లేకపోవడం పట్ల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. భోపాల్, భువనేశ్వర్, జో«ద్‌పూర్, పట్నా, రాయ్‌పూర్, రిషికేశ్‌ ఎయిమ్స్‌ల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని వెల్లడించింది.

మరిన్ని వార్తలు