-

రోడ్డుపై గుట్టలుగా క్యాలీఫ్లవర్స్‌.. ఎగబడ్డ జనం

3 Feb, 2021 14:49 IST|Sakshi
క్యాలీఫ్లవర్స్‌ కోసం రోడ్డుపై జనం

లక్నో : కష్టపడి పండించిన పంటకు దారుణమైన ధర పలుకుతోందన్న బాధతో ఓ రైతు తన మనసును కష్టపెట్టే నిర్ణయం తీసుకున్నాడు. పండించిన పంటను మొత్తం రోడ్డు పాలు చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. వివరాలు..  జహానాబాద్‌ టౌన్‌కు చెందిన మహ్మద్‌ సలీమ్‌ తనకున్న పొలంలో క్యాలీఫ్లవర్‌ పంట పండించాడు. పంటను మొత్తం కోసి అమ్ముకోవటానికి  పిలిభిత్‌లోని మార్కెట్‌ యార్డ్‌కు తీసుకువచ్చాడు. కిలో క్యాలీఫ్లవర్‌ రీటైల్‌ ధర రూ.12నుంచి రూ.14 ఉంది. అయితే సలీమ్‌ తనకు రూ.8 వచ్చినా చాలనుకున్నాడు. కానీ, అందుకు భిన్నంగా దళారులు కేవలం ఒక రూపాయి మాత్రమే ధర చెల్లిస్తామన్నారు. దీంతో అతడు షాక్‌ తిన్నాడు. బాధను తట్టుకోలేక 10 క్వింటాళ్ల పంటను రోడ్డు పాలు చేశాడు. దీంతో రోడ్డు మీద పడిన తాజా క్యాలీఫ్లవర్స్‌ను సొంతం చేసుకోవటానికి జనం ఎగబడ్డారు. ( రైతుల కోసం రిహన్నా.. ఫూల్‌ అన్న కంగనా)

దీనిపై మహ్మద్‌ సలీమ్‌ మాట్లాడుతూ.. ‘‘ నేను నాకున్న అర ఎకరం పొలంలో క్యాలీఫ్లవర్స్‌ పండించాను. పంట పండించటానికి ఎనిమిది వేల రూపాయలు.. దాన్ని మార్కెట్‌కు తరలించటానికి మరో నాలుగు వేల రూపాయలు ఖర్చు అయింది. అయితే మార్కెట్లో నా పంటకు దారుణమైన రేటు కట్టారు. దీంతో భరించలేకపోయాను. దానికి తోడు వాటిని ఇంటికి తీసుకొచ్చేంత డబ్బు నా దగ్గరలేదు. అందుకే పంటనంతా రోడ్డు పాలు చేశాను’’ అని చెప్పాడు.

మరిన్ని వార్తలు