రైతులకు ఢిల్లీలోకి అనుమతి.. కానీ

27 Nov, 2020 15:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. రైతులను ఢిల్లీలోకి అనుమతించారు. అయితే పోలీసు ఎస్కార్ట్‌ మధ్యే వారు నగరంలోకి అడుగు పెట్టాలని షరతు విధించారు. ఇక ఈ రోజు ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దులోని సింఘ్‌ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ప్రభుత్వం, సంయుక్త్‌ కిసాన్ మోర్చా నాయకుల మధ్య చర్చల తరువాత ఢిల్లీ బురారీలోని నిరంకారి మైదానంలో రైతులు నిరసన తెలిపేందుకు అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమంలో ఉద్రిక్తంగా మారింది. పంజాబ్‌ నుంచి వేలాది మంది రైతులు హర్యానా మీదుగా రాజధాని బాటపట్టారు. వారిని నిలువరించేందుకు హర్యానా సర్కార్‌ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. బారికేడ్లు పెట్టి ఎక్కడిక్కడ రైతులను, కార్మిక సంఘాల నేతలను అడ్డుకుంటోంది. (చదవండి: నిరసనకారుడి వీడియో నెట్టింట్లో వైరల్)

అంతేకాకుండా పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌, రాజస్తాన్‌ హర్యానా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి బయలుదేరడంతో ఢిల్లీ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. రైతులను జల ఫిరంగులు ప్రయోగిస్తూ ఎవరినీ కూడా నగరం లోపలకు అనుమతించకుండా అడ్డుకుంటున్నారు. రైతులను అదుపులోకి తీసుకోవడానికి తొమ్మిది స్టేడియాలను తాత్కాలిక జైలుగా మార్చడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని కోరారు. కానీ పోలీసుల అభ్యర్థనని హోం మంత్రి సత్యేందర్ జైన్ నిరాకరించారు.

మరిన్ని వార్తలు