జంతర్‌మంతర్‌ మహాపంచాయత్‌.. తికాయత్‌ నిర్బంధం, ఢిల్లీలో హైటెన్షన్‌

22 Aug, 2022 09:02 IST|Sakshi

న్యూఢిల్లీ: రైతు సంఘాల సమాఖ్య ఎస్‌కేఎం సోమవారం(ఇవాళ) జంతర్‌మంతర్‌లో మహాపంచాయత్‌ తలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. నిరుద్యోగ సమస్యపై ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ను ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. 

మధు విహార్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, తిరిగి వెళ్లిపోవాల్సిందిగా కోరినట్లు ఆయన్ను కోరినట్లు స్పెషల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(శాంతి భద్రతలు) దేపేంద్ర పాఠక్‌ చెప్పారు. ఆయన అంగీకరించడంతో పోలీసు భద్రతతో వెనక్కి పంపినట్లు వివరించారు.  దేశ రాజధానిలో అనవసరంగా గుమిగూడటాన్ని నివారించడానికే తికాయత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్‌ వర్గాలు తెలిపాయి. 

రైతు గళం వినిపించకుండా చేసేందుకు కేంద్రం ఆదేశాల మేరకే ఢిల్లీ పోలీసులు తనను నిర్బంధంలోకి తీసుకున్నారని తికాయత్‌ ఆరోపించారు. ఇది మరో విప్లవానికి నాంది కానుందని, తమ పోరాటం ఆపేది లేదని ఆయన ట్వీట్‌ చేశారు. తికాయత్‌ను నిర్బంధించడాన్ని ఆప్‌ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఖండించారు.

ఇదీ చదవండి: చెప్పుతో కొట్టి.. పరారయ్యాడు!

మరిన్ని వార్తలు