మేం కీలుబొమ్మలం కాదు: ఫరూక్‌

31 Aug, 2020 06:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా కశ్మీర్‌లోని ఆరు రాజకీయపార్టీలు ఉమ్మడిగా చేసిన ‘గుప్‌కార్‌ డిక్లరేషన్‌’ను పాకిస్తాన్‌ స్వాగతించడంపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ)అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా గట్టిగా స్పందించారు. ‘మేం ఎవరి చేతుల్లోనూ కీలుబొమ్మలం కాము’ అంటూ వ్యాఖ్యానించారు. ‘జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలను ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన పాకిస్తాన్‌కు అకస్మాత్తుగా ఇప్పుడు ఇష్టం పుట్టుకొచ్చింది. ఢిల్లీకి గానీ, సరిహద్దుల్లో ఉన్న వారికి గానీ.. మేం ఎవరి తొత్తులం కాదని స్పష్టం చేస్తున్నా’ అని తెలిపారు. ఎన్‌సీ, పీడీపీ, కాంగ్రెస్, మరో మూడు పార్టీలు కలిసి ప్రకటించిన గుప్‌కార్‌ డిక్లరేషన్‌ సాధారణ ఘటన కాదు, కీలక రాజకీయ పరిణామం అంటూ పాక్‌ విదేశాంగ మంత్రి మహ్మూద్‌ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు.  ‘సాయుధులను కశ్మీర్‌లోకి పంపడం పాక్‌  మానాలనీ, భారత్, పాక్‌లు చర్చలు ప్రారంభించాలని ఆయన కోరారు. కశ్మీర్‌లోని ఆరు రాజకీయ పార్టీలు ఆగస్టు 22న శ్రీనగర్‌లోని గుప్‌కార్‌ రోడ్డులో ఉన్న ఫరూక్‌ అబ్దుల్లా నివాసంలో సమావేశమై చేసిన ఉమ్మడి ప్రకటనను గుప్‌కార్‌ డిక్లరేషన్‌ అని అంటున్నారు.
 

మరిన్ని వార్తలు