ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్ట్‌లోనే పాక్‌!

19 Oct, 2020 06:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) ప్లీనరీ అక్టోబర్‌ 21–23 తేదీల్లో జరగనుంది. ఈ వర్చువల్‌ సదస్సులోనూ పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్ట్‌’లోనే కొనసాగించాలని నిర్ణయించే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్‌ అజర్, హఫీజ్‌ సయీద్, జకీవుర్‌ రెహమాన్‌ లఖ్వీలపై చర్యలు తీసుకోవాలనే విషయం సహా ఆరు షరతులను పాక్‌ నెరవేర్చకపోవడంతో ఆంక్షల విధింపునకు అవకాశమున్న గ్రే లిస్ట్‌లోనే పాక్‌ను కొనసాగించే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నగదు అక్రమ రవాణాను, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకునే విషయంలో ఆయా దేశాల పనితీరు ఆధారంగా ఎఫ్‌ఏటీఎఫ్‌ సూచీలను రూపొందిస్తుంది.

అలాగే, దేశంలోని ఉగ్రవాదులకు సంబంధించిన అధికారిక జాబితా నుంచి పాక్‌ 4 వేల పేర్లను తొలగించడాన్ని కూడా ఎఫ్‌ఏటీఎఫ్‌ పరిగణనలోకి తీసుకోనుంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించే విషయానికి సంబంధించి మొత్తం 27 బాధ్యతలను ఎఫ్‌ఏటీఎఫ్‌ పాకిస్తాన్‌ను అప్పగించగా.. వాటిలో 21 బాధ్యతలను ఆ దేశం నెరవేర్చింది. మిగతా ఆరులో.. ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదులుగా నిర్ధారించిన జైషే మొహమ్మద్‌ ఉగ్ర సంస్థ చీఫ్‌ మసూద్‌ అజర్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్, లష్కరే సంస్థ కమాండర్‌ జకీవుర్‌ రెహమాన్‌ లఖ్విలపై చర్యలు తీసుకోకపోవడం ఒకటి. ఆంక్షల కారణంగా పాకిస్తాన్‌కు ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఎటువంటి ఆర్థిక సాయం లభించదు.

మరిన్ని వార్తలు